నిన్నమొన్న బీజేపీపై ఈటల చేసిన విమర్శలివీ
2020, డిసెంబర్ 19న హుజూరాబాద్లో ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు
కాషాయ పార్టీ కాలగర్భంలో కలువక తప్పదు. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజల నమ్మకం కోల్పోయి కనుమరుగు అయింది. ఇదే గతి బీజేపీకి పడుతుంది. కాంగ్రెస్ మాదిరిగానే కనుమరుగవుతుంది. కేంద్రం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పక్కనపెట్టి రైతులను నిలువునా ముంచేందుకు కొత్త చట్టం తీసుకువచ్చింది. యూపీ, హర్యానా, పంజాబ్, తదితర రాష్ర్టాల రైతులు ఎముకలు కొరికే చలిలో కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికే 20 మంది వరకు రైతులు చనిపోయారు. అయినా, మోదీ మాత్రం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కాలక్రమంలో కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.
మోదీ సర్కారు రైతు వ్యతిరేకి..
రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ఆదానీ, అంబానీ గ్రూపులకు దేశాన్ని కట్టబెడుతున్నారు. గుజరాత్ అభివృద్ధిని చూపి మోదీ ఓట్లు దండుకున్నారు. మోదీ పాలనలో దేశంలో ప్రజలు ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగటం లేదు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పోలేదు. దేశంలో సంపద గొప్పగా పెరగలేదు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికే రిలయన్స్, తదితర కార్పొరేట్ సంస్థలు పల్లెల్లో మాల్స్ పెట్టి చిరువ్యాపారుల పొట్టకొట్టేలా మోదీప్రభుత్వ చర్యలున్నాయి.