2014 నుంచి వందల పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పథకాన్ని నిలిపివేసిన దాఖలా ఒక్కటీ లేదు. మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను అమలుచేస్తున్నదీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరూ అడుగకపోయిన మొదలుపెట్టిన దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి ఎందుకు ఆపేస్తారు? పేయాల్సి ఉంటే ఎందుకు మొదలుపెడతారు? ఈ మాత్రం లాజిక్ తెలియదా ఈటల అండ్ కో?
హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది ఈటల రాజేందర్ అండ్ కంపెనీ తీరు. దళితబంధును ఆపాలంటూ అడ్డుపుల్లలు వేసినవారే, ఇప్పుడు సర్కారే ఆపేసిందని అన్నీ గాలికొదిలేసి అబద్ధాలాడుతున్నారు. నిన్నటిదాకా నావల్లే దళితబంధు వచ్చిందని గొప్పలకుపోయిన ఈటల, ఆ మంత్రం పనిచేయదని తెలుసుకుని పథకాన్ని ఆపేందుకు కుట్రలు చేశారు. ఇప్పుడు ఆగిపోతే సీఎం కేసీఆర్ ఆపేశారంటూ నాలుక ఎటుతిరిగితే అటు మడతపేచీ వేస్తున్నారు. ఓటమిభయంతో వణికిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికి బీజేపీ నాయకులు తందానా అంటున్నారు. దళితబంధును చూసి కండ్లలో నిప్పులు పోసుకున్నారు. గేమ్ చేంజర్ పథకానికి అడ్డుపుల్లలు వేసి అది కాస్తా ఆగేసరికి బట్టకాల్చి మీదేసే పనికి తెగబడుతున్నారు హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ‘దళిత బంధు ఇస్తే సంతోషపడ్డం. ఇప్పుడు దళితబంధు పక్కనపెట్టారు. దళితబంధును బంద్ చేసి హుజురాబాద్ దళితుల కండ్లళ్లలో మట్టి కొట్టకండి’ అంటూ ప్రచారంలో మొసలికన్నీరు కారుస్తున్నారు. ఒకప్పుడు దళిత బంధు అమలు చేయవొద్దని లేఖలు రాసిన వారే.. ఇప్పుడు దళితబంధు అమలు చేయాలని మాయదారిమాటలు చెప్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి, పథకం ప్రారంభించడం, నిలిపి వేయడం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలోనే లేదు. 2014 నుంచి చూసుకుంటే వందకు పైగా ముఖ్యమైన పథకాలను ప్రారంభించారు. చాలావరకు దేశమే తిరిగి చూసి అనుసరించే స్థాయిలో ఉన్నాయి. అనేక రాష్ర్టాలు అనుకరించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకాలను ఆయన ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తప్ప నిలిపివేసిన దాఖలా ఒక్కటీ లేదు. పథకాలు ప్రారంభించేందుకు, వాటిని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఒక్కసారి డిసైడ్ అయితే ఎన్ని కోట్ల ఖర్చుకైనా వెనుకాడరు. ఎవరు తమకు ఈ పథకం కావాలని అడగకపోయినా, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయకపోయినా.. ఆయా వర్గాల అవసరాలు, పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా స్వయంగా పథకాల రూపొందించి అమలుచేస్తారు. ఒకరు చెప్పకున్నా మొదలుపెట్టిన పథకాన్ని ఆయనే ఎందుకు ఆపేస్తారు? ఆపేయాల్సి ఉంటే ఎందుకు మొదలుపెడతారు? ఈ మాత్రం లాజిక్ తెలియదా ఈటలకు? ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకువెళ్తున్నారు సీఎం కేసీఆర్. ఇటీవల ప్రారంభించిన దళితబంధు పథకం అందులో ఒకటి మాత్రమే. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లు, హరితహారం, మిషన్భగీరథ, మిషన్కాకతీయ, పల్లెప్రగతి, గొర్రెల పంపిణీ, డబుల్బెడ్రూం ఇండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సూపర్హిట్ అయిన పథకాలే. ఎప్పుడో మొదలై ప్రస్తుతం అమలవుతున్న పథకాలే. లక్షల మంది లబ్ధిదారులు, కోట్లలో నిధుల ఖర్చు.. ఇదీ సీఎం కేసీఆర్ పథకాల చరిత్ర.
ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని దళితబంధు పథకాన్ని నిలిపివేశారని బీజేపీ నాయకులు అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారు. ఏడాది క్రితం ప్రారంభం కావాల్సిన దళితబంధు పథకం కరోనా కారణంగా నిలిచిపోయిందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. నిజంగా ఎన్నికల కోసమే అయితే పథకం ప్రారంభించి, నిలిపివేయడం జరుగుతుందా? మొదలుపెట్టి ఆపేస్తే ప్రజల్లో గందరగోళం తలెత్తుతుందని ఒక పార్టీ అధినేతగా కేసీఆర్కు తెలియదా? సామాన్యుడు సైతం ఈ లాజిక్ను అర్థం చేసుకోగలడు. బీజేపీ మాత్రం బట్టకాల్చి మీద వేసేందుకు విఫలయత్నం చేస్తున్నది. ఎన్నికల కోసమే పథకాలు పెట్టి సీఎం కేసీఆర్ మోసం చేశారా? ఎలాగో చెప్పండంటే సమాధానం రాదు. ఎవరు అడిగితే, ఏ ఎన్నికలు వచ్చాయని రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్కిట్లు, ఆరోగ్యలక్ష్మి పథకాలను అమలుచేశారు? ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం పెట్టని అనేక పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసి ఇతర రాష్ట్రాలకు, పార్టీలకు ఆదర్శంగా నిలిచారు.