హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈనెల 17న బీహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో జరిగిన పేలుళ్ల కేసులో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో నివసిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ఖాన్లను బుధవారం ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కుట్రలో మరో వ్యక్తి వీరికి సహకారం అందించినట్టు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మూడో వ్యక్తి ఎవరు.. అరెస్టయిన ఇద్దరితో ఎప్పటి నుంచి టచ్లో ఉన్నాడు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇక్కడున్న ఇన్నేండ్లలో ఈ ఇద్దరు అన్నదమ్ములతో సన్నిహితంగా మెలిగిన ఇతరుల గురించిన సమాచారం కూడా సేకరిస్తున్నారు.
హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మల్లేపల్లిలో నిందితుల ఇంట్లో ఎన్ఐఏ అధికారులు రెండు రోజులుగా జరిపిన సోదాల్లో ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)ని తయారు చేసే మెటీరియల్తోపాటు బాంబు తయారీ సమాచారం బయటపడ్డాయి. ఉగ్రవాద సంస్థల సమాచారంతో కూడిన డిజిటల్ డివైజ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ సిబ్బంది సైతం ఈ ఆపరేషన్లో కీలకంగా పాల్గొంటున్నారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులను గురువారం ఉదయం కోర్టులో హాజరుపర్చిన అనంతరం పీటీ వారెంట్పై పాట్నాకు తరలించినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ కుట్రలో కీలకంగా పనిచేసిన పాకిస్థానీ హ్యాండ్లర్ ఇక్బాల్ఖాన్ ఎంత డబ్బు చేరవేశాడు..దర్భంగాతోపాటు మరిన్ని పేలుళ్లకు కుట్ర పన్నారా? అన్నది కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.