హైదరాబాద్ : రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరైన వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో జరిగింది. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మంత్రివర్గం పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది.
ఈ సందర్భంగా వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని ప్రస్తుతం జైలు ఉన్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్తుతం ఉన్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలంది. జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేయాలని తర్వాతి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని హోం శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.