సంగారెడ్డి, జూన్ 14: తెలంగాణ ప్రభుత్వం పప్పుదినుసులు పండించే అన్నదాతకు అండగా మద్దతు ధరలు కల్పిస్తున్నదని, ఉచితంగా ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా కంది విత్తనాలు అందజేశారు. అంతకుముందు పాశమైలారం పారిశ్రామికవాడలోని కిర్బి పరిశ్రమ యాజమాన్యం, అజీమ్-ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతినిధులు విరాళంగా ఇచ్చిన మెడికల్ ఎక్యుప్మెంట్కు సంబంధించిన వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో రూ.51 లక్షల విలువైన 554 క్వింటాళ్ల విత్తనాలు అన్నదాతలకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పొద్దు తిరుగుడు, పల్లీ, ఇతర నూనె గింజల ఉత్పత్తిని ఎక్కువగా ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఈ వానకాలంలో రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 20 లక్షల ఎకరాల్లో కంది, 8 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పప్పుదినుసులకు మరింత మద్దతు ధర పెంచిందని, జిల్లాలో కంది సాగు బాగుందని, సబ్సిడీపై రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు.
ఈ ఏడాది జిల్లాలో కంది, పత్తి సాగును ప్రోత్సహించాలని, మంత్రి అధికారులకు సూచించారు. అందుకోసం ఉచితంగా అందజేస్తున్న కంది విత్తనాలను ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. అంతర్జాతీయ బహిరంగా మార్కెట్లో తెలంగాణ పత్తికి ఎక్కువ డిమాండ్ ఉందని, ప్రభుత్వం ఎంఎస్పీ ధర కంటే అధిక ధరకు అమ్మడానికి రైతులకు వెసులుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, కిర్బి పరిశ్రమ ఎండీ, సీఈవో రాజు, అజీమ్-ప్రేమ్జీ ప్రతినిధులు, డీఎంహెచ్వో గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చూసే పార్టీలోకి..
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని లింగంపల్లి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల్లో పాల్గొన్న అనంతరం లింగంపల్లి గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంపల్లి సర్పంచ్ జయరంజినీ మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సర్పంచ్ను ఆయన ఆహ్వానిచ్చారు. సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లింగంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.