నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
ఎడపల్లి పీహెచ్సీ సందర్శన
ఎడపల్లి (శక్కర్నగర్), మే 18: కరోనాను ప్రాథమిక దశలోనే గుర్తించి, వెంటనే చికిత్సను ప్రారంభిస్తే ప్రజలు త్వరగా కోలుకుంటారని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు జవేరియా సుల్తానా, సమతతో మాట్లాడి దవాఖానలో అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న ఐసొలేషన్ కిట్లను పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అక్కడకు వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాలన్నారు.
పాజిటివ్ వచ్చిన వారికి పరామర్శ..
ఎడపల్లిలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. అనంతరం నయాబాదిలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించిన ఆయన.. వివరాలను ఏఎన్ఎం గంగామణిని అడిగి తెలుసుకున్నారు. దవాఖాన పక్కనే ఉన్న ఓ వృద్ధురాలికి జ్వరం రావడంతో ఆమెను కలెక్టర్ పరామర్శించారు. మంగళ్పాడ్ గ్రామంలో కూడా ఓ బాధిత కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించారు.
మండల అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్..
సర్వే విషయమై మండలస్థాయి అధికారులను కలెక్టర్ ప్రశించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీవో శ్రీనివాస్ పనితీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఆర్డీవో రాజేశ్వర్, ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ మనోహర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల మాధవి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.