హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,522 కిలోమీటర్ల మేర బహుళ వరుస మొక్కలు నాటారు. ఎనిమిది రోజుల్లో బహుళ వరుసలో 2,318 కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున అందజేయగా 74 వేల మొక్కలను నాటారు. 23.25 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 8.52 లక్షల మొక్కలను నాటారు.
ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్తో కలిసి రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పల్లె ప్రకృతివనాన్ని, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. హరితహారంలో మొక్కలు నాటారు. – రఘునాథపాలెం
గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హౌసింగ్శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం ఉదయం వారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో పర్యటించారు. – వేల్పూర్
పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంగారుగూడెంలో నిర్వహించిన హరితహారంలో మొక్క నాటి నీళ్లు పోశారు. – కురవి
పల్లెలను పరిశుభ్రంగా మార్చడమే పల్లెప్రగతి లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొక్కలను నాటారు. సులేమాన్నగర్లోనూ మొక్క నాటి నీళ్లుపోశారు. – రుద్రూర్