లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 27 : రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతున్నది. రెండోరోజైన మంగళవారం పలు జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై, లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, వర్ని మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కార్డులను పంపిణీ చేశారు. ఎవరైనా అనర్హులు, అవసరం లేని వారు ఆహార భద్రత కార్డులను కలిగి ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వాపస్ ఇవ్వాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు, రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామ శివారులో ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొత్త కార్డులను అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ 79 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో 354, గ్రామీణ ప్రాంతాల్లో 83, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 265 రేషన్ కార్డులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పంపిణీ చేశారు.