లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ అనుచరుడు, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మను ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడ్ని చేశారు. తూర్పు యూపీ జిల్లా మౌకు చెందిన ఆయన శాసన మండలిలో సభ్యుడు కూడా. కరోనా నియంత్రణలో విఫలమయ్యారన్న విమర్శలతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రి వర్గం మార్పుపై ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. ఏకే శర్మను యూపీ మంత్రిగా చేయవచ్చన్న టాక్ వినిపించింది. కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏకే శర్మను ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరిలో బీజేపీలో చేరిన ఆయన ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు.