పన్నీర్సెల్వం, బాబుల్ సుప్రియో,
మెట్రో శ్రీధరన్కూ బలమైన పోటీ
విజయన్, స్టాలిన్కు మాత్రం నల్లేరుపై నడకే!
ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ
నందిగ్రామ్లో మమతకు సవాల్గా మారిన సువేందు
మరోవారంలో ప్రారంభంకానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల సమారాంగణంలో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ఆయా పార్టీల కీలక నేతలు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ప్రజల నాడి ఎలా ఉన్నది? ప్రత్యర్థుల నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయాశ్వాల్ని అధిరోహించగలరా?
మమతా బెనర్జీ-సువేందు అధికారి
ఈ ఎన్నికల్లో యావత్ ప్రజానీకాన్ని అకర్షించిన స్థానం ఏదైనా ఉన్నదంటే అది బెంగాల్లోని నందిగ్రామ్ మాత్రమే. భవానీపూర్ స్థానం నుంచి రెండుసార్లు పోటీచేసి గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. టీఎంసీని వదిలిపెట్టి.. బీజేపీలో చేరిన ఒకప్పటి తన విధేయుడు సువేందు అధికారికి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఎలాగైనా గెలువాలని దీదీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నమ్మిన తనను వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారికి (సువేందు అధికారి) ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె విశ్వసిస్తున్నారు. 2007 నందిగ్రావ్ులో భూసేకరణ వ్యతిరేక ఆందోళనలో కుమారుడిని కోల్పోయిన టీఎంసీ నేత, 2009 నుంచి 2016 వరకు నందిగ్రామ్కు ప్రాతినిధ్యం వహించిన ఫిరోజా బీబీ కూడా మమత తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, తాను ఎమ్మెల్యేగా ఉన్న నందిగ్రామ్లో మళ్లీ విజయం సాధించి మమతను నైతికంగా, మానసికంగా దెబ్బతీయాలని సువేందు అధికారి ప్రణాళికలు రచిస్తున్నారు. కార్యకర్తల బలం, భూసేకరణ వ్యతిరేక ఆందోళనలో కీలక పాత్ర పోషించడం, బీజేపీ అండదండలు మేలు చేస్తాయని భావిస్తున్నారు.
బాబుల్ సుప్రియో
టోలిగంజ్ నుంచి బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో బరిలోకి దిగుతున్నారు. టీఎంసీ కీలకనేత అరూప్ బిస్వాస్కు ఈ స్థానంపై పట్టుంది. మూడుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా బిస్వాస్ గెలుపొందారు. పార్టీ క్యాడర్ను కిందిస్థాయి నుంచి పటిష్టం చేస్తున్నారు.
పళనిస్వామి-పన్నీర్సెల్వం
అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం పళనిస్వామి.. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2011 నుంచి ఆయన ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకేతో పాటు ఏఎంఎంకే, ఎన్టీకే తదితర పార్టీ అభ్యర్థులు పళనిస్వామికి గట్టి పోటీని ఇవ్వలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నాడీఎంకే మరోనేత పన్నీర్సెల్వం.. బోడినయకనూరు నుంచి బరిలో ఉన్నారు. 2011, 2016లో ఆయన ఈ స్థానంలో విజయం సాధించారు. అయితే, డీఎంకే నేత ఎస్ లక్ష్మణన్ నుంచి ఈసారి ఆయనకు గట్టిపోటీ ఎదురుకానున్నది.
ఎంకే స్టాలిన్
కొలతూర్ నుంచి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్థానికంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పేద, మధ్యతరగతి ప్రజల మద్దతు ఉన్నది. అయితే కొలతూర్ అభివృద్ధి తమ ప్రభుత్వంతోనే సాధ్యమైందని రాజారామ్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈయన స్టాలిన్పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
పినరాయి విజయన్
కేరళ సీఎం, సీపీఎం నేత పినరాయి విజయన్ ధర్మాడమ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో విజయన్ గెలుపు ఖాయమేనంటున్నారు.
మెట్రో శ్రీధరన్
మెట్రోమ్యాన్గా గుర్తింపు పొందిన ఈ శ్రీధరన్ను బీజేపీ.. పాలక్కాడ్ నుంచి పోటీలోకి దింపింది. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ బలమైన నేత. ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరంబిల్ ఇటీవల నిరాహార దీక్షకు దిగడం ఆయనకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
సర్బానంద సొనోవాల్
అస్సాం సీఎం, బీజేపీ నేత సర్బానంద సొనోవాల్ మజులీ నుంచి బరిలో ఉన్నారు. 2011లో కాంగ్రెస్ నేత రాజీబ్ లోచన్ ఇక్కడ గెలుపొందారు. అయితే 2016లో రాజీబ్పై సొనోవాల్ నెగ్గారు. ఈసారి మజులీలో సొనోవాల్ గెలిచినా, ఇచ్చిన హామీల్లో కొన్ని పూర్తిచేయనందుకు.. ఆయనకు మెజారిటీ తగ్గవచ్చని భావిస్తున్నారు.