హైదరాబాద్ : ప్రకృతి పునరుద్ధరణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ సంయుక్తంగా వర్చువల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రకృతితో ప్రాణులకు విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది.
మనిషి ప్రకృతిని కాపాడితే అది తిరిగి భూమిపై ఉన్న జీవరాశుల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఏటా మనం జూన్ 5న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఇపి) సహకారంతో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడమే ప్రపంచ పర్యావరణ ముఖ్య ఉద్దేశం ఉన్నారు.
2020లో టైమ్ ఫర్ నేచర్ థీమ్ కాగా, ఇక ఈ ఏడాది ‘ప్రకృతిని ఉహించు. సృష్టించు, పునరుద్ధరించు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ‘ఎకో సిస్టమ్ రిస్టోరేషన్’ (పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ) ఈ దశాబ్ది థీమ్ గా ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందని తెలిపారు. దీంతో పాటు ప్రకృతితో మానవ సంబంధాలను పునఃస్థాపించడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ భాగస్వామ్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ప్రకృతిని ఉహించు. సృష్టించు, పునరుద్ధరించు అనే ఈ ఏడాది థీమ్ లక్ష్యాన్ని సీఎం కేసీఆర్ ఎప్పుడో గుర్తించారు. అభివృద్ధి అనేది పర్యావరణ హితంగా ఉండాలని భావించిన సీఎం మనకు ఉన్న ప్రకృతి వనరులను కాపాడేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
హరితహార కార్యక్రమం ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర మంతా మన కళ్లముందు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల తెలంగాణలో 4% పచ్చదనం పెరిగింది. అటవీ ప్రాంత విస్తీర్ణం సైతం వృద్ధి చెందింది. వన్యప్రాణి సంరక్షణలోనూ చక్కటి ఫలితాలు సాధించాం. వన్యప్రాణుల సంతతి కూడా క్రమంగా పెరుగుతున్నదని మంత్రి తెలిపారు.
నీటి లభ్యత రోజురోజుకు తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్ లను, పథకాలను చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నీటి లభ్యత ఘననీయంగా పెరిగిందన్నారు. దీంతో సాగు, తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు.
జలచర జీవజాలం వృద్ది చెందింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ , మంజీరా నది, ఇతర వాటర్ బాడీలలో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. ప్లెమింగో పక్షులు ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నాయని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ అనేది ఏ ఒక్క వ్యవస్థో, వ్యక్తులతోనే సాధ్యం కాదు. ప్రజ భాగస్వామ్యంతోనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామన్నారు. జీవవైవిధ్య పరిరక్షతోనే పర్యావరణ పరిరక్షణ ఆధారపడి ఉందనే విషయంపై ప్రజలను చైతన్య పరచడంతో పాటు విద్యార్థుల్లో సరైన అవగాహన కల్పించాన్నారు. పర్యావరణానికి, జీవరాశులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి వారికి వివరించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడంలో పీసీబీ, ఈపీటీఆర్ఐ, అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములమై ఈ సంవత్సర ఇతివృత్త లక్ష్యాన్ని చేరుకుందామని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి