మెదక్, మే 26 : ఈ నెల 28, 29, 30 తేదీల్లో పౌర సరఫరాలు, వ్యవసాయ, పౌర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సూపర్ స్ప్రేడర్లకు కరోనా టీకా వేయటకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం జిల్లాల కలెక్టర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ వృథా కాకుండా పకడ్బందీగా సూపర్ స్ప్రెడర్లకు టీకా వేయాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 3,200 మంది సూపర్ స్ప్రెడర్లను(వాహకులు)గా గుర్తించిన చౌక ధర దుకాణ డీలర్లు, హెల్పర్లు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకు శ్రామికులు, ఎరువులు, రసాయనాలు, విత్తన డీలర్ దుకాణాల కార్మికులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో గ్రాఫర్లకు టీకా వేసేందుకు గుర్తించామన్నారు. వారికి ఈ నెల 28, 29, 30 తేదీల్లో కరోనా టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 521 చౌక ధర దుకాణాలు, 16 ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, 80 పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్న 1,853 హెల్పర్లు, శ్రామికులకు టీకా వేయనున్నామన్నారు. అలాగే జిల్లాలో ఉన్న 223 ఎరువులు, రసాయన మందులు, విత్తన దుకాణాల కార్మికులు సుమారు 900 మందికి టీకాలు వేయనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా సుమారు 400 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో గ్రాఫర్లకు కూడా టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని ఏడు ప్రాంతాలు మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, పాపన్నపేట, పెద్దశంకరంపేటలో టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలన్నీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని అన్నారు. వ్యా క్సినేషన్ కార్యక్రమాన్ని సంబంధిత మండల ప్రత్యేక అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మండల వ్యవసాయాధికారులు, డిప్యూ టీ తహసీల్దార్లు, నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం జయప్రదం అయ్యేలా చూడాలని కోరా రు. టీకాలు వేసుకోవడానికి వెళ్లే వారిని నియంత్రించవద్దని పోలీసులకు సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాంనాయక్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి శాంతికుమార్ పాల్గొన్నారు.
వచ్చే మూడు రోజులు వ్యాక్సినేషన్
సిద్దిపేట కలెక్టరేట్, మే 26 : చౌకధరల దుకాణాల, ఎల్పీజీ పెట్రోల్ బంక్ డీలర్లు, వర్కర్లు ఎరువులు, పంట క్రిమి సంహారక మందుల, విత్తనాల డీలర్లు, జర్నలిస్ట్లను కొవిడ్ బారిన పడటానికి ఇతరులకు వ్యాప్తి చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లుగా ప్రభుత్వం గుర్తిందని, జిల్లాలో వీరికి వచ్చే 28,29,30 తేదీల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, సమాచార, పౌర సంబంధాల శాఖ, చౌకధరలు దుకాణాలు, ఎల్పీజీ ఫర్టిలైజర్ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా వర్గాల నుంచి జిల్లాలో సుమారు 6 వేల మంది ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వీరికి తొలుత వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతి మండలంలో ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేస్తామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వాక్సినేషన్ వేసుకునేందుకు వీరికి అనుమతులు ఇవ్వాల్సిందిగా పోలీసులకు తెలియజేస్తామన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా డీలర్, వర్కర్ గుర్తింపు కార్డు ఆధార్కార్డు తీసుకెళ్లాలన్నారు. జర్నలిస్టులు ఆధార్కార్డుతో పాటు అక్రిడిటేషన్ కార్డు వెంట తీసుకువెళ్లాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లా వైద్యాధికారి మనోహర్, పౌరసరఫరా సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, చౌకధరలు, ఎల్పీజీ దుకాణాలు ప్రతినిధులు పాల్గొన్నారు.