కరీంనగర్ : కాళేశ్వరం జలాలతో రైతులకు వానాకాలం సాగు కోసం భరోసా కల్పిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. సోమవారం ఎల్ఎండీ జలాశయం నుంచి అధికారులతో కలసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. కాళేశ్వరం జలాలతో బీడు భూములన్నీ సాగులోకి వస్తున్నాయని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
సాగుకు సమృద్ధిగా నీరు అందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం జలాలు ఎస్సారార్ ప్రాజెక్టులో ఎత్తి పోసినట్టు తెలిపారు.
రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు 3 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తామని చెప్పారు. రైతుల డిమాండ్ ను బట్టి అవసరమైతే నీటివిడుదల సామర్థ్యం 3 వేల 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. కాకతీయ కాలువ ఆయకట్టు కింద సుమారు 9 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని వెల్లడించారు. జులై మాసంలో ఎల్ఎండీలో ప్రస్తుతం 21 టీఎంసీల నీటితో జలకళ సంతరించుకుందని, గత చరిత్ర చూస్తే మానేరు జలాశయంలో జూన్ , జులై మాసంలో 5 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉండే వని గుర్తు చేశారు.
కాళేశ్వరం జలాల రాకతో పరిస్థితులు మారి పోయాయన్నారు. నా చేతులతో నీటిని ఇతర ప్రాంతాలకు విడుదల చేయడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఎల్ఎండీ జలాశయం నుంచి విడుదల చేసిన నీరు కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ నుంచి సూర్యాపేట వరకు 7 జిల్లాలలోని 33 మండలాల్లోని భూములకు సాగునీరు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, సుంకిశాల సంపత్ రావు , నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, ఎస్ఈ శివ కుమార్,ఈఈ నాగభూషణం, డిప్యూటీ ఈఈ సమ్మయ్య, ఏఈ లు కాళిదాసు, వంశీ, అంజు ఉన్నీసా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ