కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, ఏప్రిల్ 21: మహమ్మారి విజృంభణతో ప్రైవేట్ సంస్థలు మూతపడగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లను సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రకటించిన 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మేడ్చల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా ప్రభావంతో అన్ని రంగాల మాదిరిగానే ప్రైవేట్ స్కూళ్లు మూత పడ్డాయన్నారు. ఇందులో పని చేస్తున్న టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సంకల్పించిన సీఎం నెలకు రూ.2 వేలతో పాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దీపికానర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.