హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో పెండింగ్ కేసులు తేలేవరకు అధిక ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆదేశించింది. సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీల్లో ఫీజులు పెంచడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్రెడ్డికి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన టీఏఎఫ్ఆర్సీ.. ఈ రెండు విద్యాసంస్థలు ఫీజులు పెంచుకునేందుకు తాము గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని, కానీ ఫీజులను ఖరారు చేయలేదని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వుల సాకుతో ఫీజులు పెంచరాదని ఆదేశించింది. అయినా ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీఏఎఫ్ఆర్సీ ఆదేశాలపై సీబీఐటీ, ఎంజీఐటీ పేరెంట్స్ అసోసియేషన్ నేతలు వీ నర్సిరెడ్డి, వీ శ్రీనివాస్, ఎస్ పద్మారెడ్డి, టీపీఏ అధ్యక్షుడు ఎన్ నారాయణ హర్షం వ్యక్తంచేశారు.