హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దేశంలో పలు బహుళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుని జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ ఇంజినీర్ ముళ్లగిరి అద్భుతరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన 1943లో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జన్మించారు. అద్భుతరావు ఇంజినీర్గా శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్ డ్యాం, ధవళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగిరెడ్డి గూడెం ప్రాజెక్టు వంటి అనేక జలాశయాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. తన అపార అనుభవం, జ్ఞానంతో దేశ నీటిపారుదల రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖలో చీఫ్ ఇంజినీర్గా పదవీ విరమణచేశారు. అక్కడితో ఆగిపోకుండా పదవీ విరమణ తర్వాత ఎల్ఎల్బీ చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కరుణాలయం పేరుతో చింతలపూడిలో వృద్ధాశ్రమం నెలకొల్పారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అద్భుతరావుకు భార్య మేరీరావు, ముగ్గురు సంతానం ఉన్నారు.