యువత ఉపాధికి సర్కారు బాసట
తోషిబా జిమ్ ప్రాజెక్టు స్ఫూర్తిదాయకం
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
పటాన్చెరు, మార్చి 27 : తెలంగాణ సర్కారు యువత నైపుణ్యాభివృద్ధికి పోత్సాహమిస్తూ ఉపాధికి బాటలు వేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో తోషీబా పరిశ్రమ చేపట్టిన జిమ్ (జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యానుఫాక్చరింగ్) ప్రాజెక్టును కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. భారత నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ సమన్వయంతో ఐటీఐల్లో చదివిన విద్యార్థులకు జిమ్ ప్రాజెక్టు ద్వారా శిక్షణను ప్రారంభించింది. 30 మంది ఐటీఐ విద్యార్థులతో తొలి బ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జపాన్ అంటేనే మనకు ఎన్నో విజయాలు కండ్లముందు కనిపిస్తాయన్నారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మన యువతకు అందుబాటులోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. తెలంగాణ యువత అభ్యున్నతికి ఏడాది శిక్షణకు ముందుకొచ్చిన తోషిబా సంస్థ ప్రతినిధులను హరీశ్రావు అభినందించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. చదువుతోపాటు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొంటే జీవితంలో రాణిస్తారని యువతకు సూచించారు. కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ జపాన్ మసాయుకీ టాగా, తోషీబా డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ సైటో కోజీ, పరిశ్రమల, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎంపీలు ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.