హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్థానిక, జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం అం దించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని హిమాయత్నగర్లో మార్కెటింగ్ కార్యాలయం, రిసెర్చ్ వింగ్ కార్యాలయాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పంటల సాగును చేపట్టేందుకు అంతర్జాతీయ మార్కెట్ల స్థితిగతులను విశ్లేషిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకు దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో మార్కెట్ రిసెర్చ్ వింగ్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రముఖ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ సహకారంతో రిసెర్చ్కు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. దానికి అనుగుణంగా రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే మార్కెట్ విశ్లేషణ, పరిశోధన, నిఘా అంచనాల ఆధారంగా డిమాండ్ ఉన్న పంటల ప్రోత్సాహానికి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. డిమాండ్ ఉన్నవి పం డిస్తే మార్కెట్లో ధర లభిస్తుందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ను తరలించి బాటసింగారంలో ఏర్పాటుచేసి, దాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.