కొత్తగూడెం క్రైం/భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగింది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
వివరాలిలా… గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు మావోయిస్టు అమరుల వారోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీస్ బలగాలు.. ఏజెన్సీ, దండకారణ్యం ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లా చర్ల మండలం సరిహద్దుల్లోని బోధనెల్లిప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులకు మావోయిస్టులు తారస పడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ పార్టీ బలగాలు ఎదురు కాల్పులకు దిగారు.
ఇరువర్గాల మధ్య సుమారు 15నిమిషాల పాటు భీకర పోరు జరినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పక్కనే ఉన్న దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఘటనా స్థలం నుంచి కాల్పుల్లో మృతి చెందిన ఒక మావోయిస్టు మృతదేహాన్ని చర్ల పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ఘటనను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ధృవీకరించారు. సరిహద్దుల్లోని చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగుఫా – భద్రాద్రి జిల్లా చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.