హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఏడవడానికే బతికిన నేల.. ఇప్పుడు బతుకమ్మ చీరలతో కడుపునిండా తింటున్నది. ఒకప్పుడు ఉరికొయ్యలను ముద్దాడిన దేహాలు.. ఇప్పుడు మగ్గం చేతబట్టి మంచి జీవితాన్ని గడుపుతున్నాయి. కరోనా కల్లోలానికి లక్షలాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు.
సిరిసిల్లలో మాత్రం మరమగ్గం అలుపుసొలుపు లేకుండా పనిచేస్తూ వేలాది మందికి ఉపాధినిస్తున్నది. ముందుచూపుతో తీసుకొన్న ‘బతుకమ్మ’ చీరల నిర్ణయం కరోనా కష్టకాలంలోనూ ఎన్నో కుటుంబాలకు కూడు పెడుతున్నది. రోజుకు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.20వేల దాకా భత్యం పొందుతూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తీసుకొన్న నిర్ణయంతో నేతన్నలు గౌరవప్రదంగా బతుకుతున్నారు.
బతుకమ్మ పండుగ పూట కోటి మంది మహిళలకు చీరలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో నిరంతరం మరమగ్గాలు నడుస్తున్నాయి. పరిశ్రమ హోదాలో లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉండటంతో పవర్ లూంలపై చీరల తయారీ కొనసాగుతూనే ఉన్నది. సిరిసిల్లలో ప్రస్తుతం ఏడువేల మగ్గాలపై 10వేల మంది నేతన్నలు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 70లక్షల చీరల తయారీ పూర్తైంది. ఓవైపు కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే, సెప్టెంబర్ నాటికి చీరల తయారీ, ప్రాసెసింగ్ చేసి జిల్లాలకు చేరవేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.