హైదరాబాద్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రసంగించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, విద్యావేత్త సురభి వాణీదేవిని భారీగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమ్మేళనంలో పలువురు సంఘం ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, జయ కామేశ్వరి, హరిత, సీతాలక్ష్మి, వెంకటయ్య, దేవేందర్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.