హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ 29 %, పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. సర్కారు వెంటే తాముంటామని స్పష్టంచేశారు. కష్టకాలంలోనూ ఉద్యోగులకు ఆర్థికంగా దన్నుగా నిలువడంపై సర్వత్రా హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని పేర్కొంటున్నారు. హైదరాబాద్లో అన్ని హెచ్వోడీలతోపాటు జిల్లా కార్యాలయాల్లో కేసీఆర్ జిందాబాద్ అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ర్టానికి తీసుకురావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్టు తెలుసుకున్న ఉద్యోగులు ఆంధ్రా నుంచి తరలివచ్చి కుటుంబసభ్యులతో కలిసి దాదాపు 500 మంది టీఎన్జీవో భవన్ వద్ద సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ను సన్మానించారు. టీఎన్జీవోలు, టీజీవోలు భారీ ఎత్తున సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలు పట్టుకొని జై కేసీఆర్.. జై తెలంగాణ, లాంగ్లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్కు తెలంగాణ విత్తన సంస్థల ఉద్యోగులు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పృథ్వీరాజ్, మహేష్బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్ పెంచడానికి అంగీకరించడంపై టీజీవో సర్వే అండ్ల్యాండ్ రికార్డ్స్శాఖ అధ్యక్షుడు ఎస్ నరేందర్రావు, ప్రధాన కార్యదర్శి ఎం రామచందర్ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తారని.. వారి సమస్యల పరిష్కారంపై ఆయన ఎప్పుడూ ముం దుంటారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లి
హన్మకొండ, మార్చి 10 : ఉద్యోగులు ఆశించిన దాని కంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగానే ఇస్తారని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో బుధవారం ఆర్అండ్బీ గెస్ట్హౌస్, మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ను వరంగల్ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులను వారు సన్మానించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఇచ్చిన 27శాతం కంటే రెండు, మూడు శాతం ఎక్కువతో పీఆర్సీని త్వరలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని బీ వినోద్కుమార్ చెప్పారు. అయినప్పటికీ కొన్ని శక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల బాధలు అర్థం చేసుకున్నది. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 29 శాతం ఫిట్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. టీఆర్ఎస్ పాలనలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులమంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే మద్దతిస్తామని ప్రకటించారు.
– హెచ్ వెంకటేశ్వర్లు, మైనార్టీ గురుకులం ప్రిన్సిపాల్, జయశంకర్
మేం పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యాం. ప్రభుత్వం మూడేండ్లు మా పని తీరును పరిశీలించి రెగ్యులర్ చేస్తామని నియామక సమయంలో తెలిపింది. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ దానిని రెండేండ్లకే కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉన్నది.
– వాణి, పంచాయతీ కార్యదర్శి, నల్లగొండ