హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ బూత్ల వద్ద శానిటైజర్లు, సిబ్బందికి మా స్క్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ బూత్లను ముందుగానే శానిటైజ్ చేశారు. ఓటర్లు స్వయంగా భౌతిక దూరాన్ని పాటించి క్యూలో నిలబడ్డారు, మాస్క్లు వేసుకొని వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజలతో పాటు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటు ఓటర్లు 730 వరకు ఉండడంతో రద్దీ లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ వరంగల్లో ఓటింగ్ 54.74 శాతం, ఖమ్మంలో 59.80 శాతం నమోదైంది. పోలింగ్, శాంతి భద్రతలు, కొవిడ్ ప్రొటోకాల్ అమలును రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి నిరంతరం పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేశారు. రిసెప్షన్ సెంటర్లో 10 మంది కంటే ఎక్కువగా ఉండకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ ముగిశాక మాట్లాడిన ఆయన.. ‘భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సద్వినియోగం చేసుకున్న ఓటరు మహాశయులకు, అవగాహన కల్పిస్తూ, సురక్షితంగా ఎన్నికల నిర్వహణ విధులు నిర్వర్తించిన అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
కార్పొరేషన్లు
వరంగల్-54.74 %
ఖమ్మం- 59.80 %
మున్సిపాలిటీలు
సిద్దిపేట – 67.18%
అచ్చంపేట – 68%
జడ్చర్ల – 66.60%
కొత్తూరు – 85.42%
నకిరేకల్ – 86.65%
పలు పట్టణాల్లోని వార్డులు
బోధన్(18వ వార్డు) – 75.79%
నల్లగొండ(26వ వార్డు) – 75.29%
గజ్వేల్(12వ వార్డు) – 74.26%
పరకాల(9వ వార్డు) – 74.31%
జీహెచ్ఎంసీ (18 వార్డు) – 27.62%