మొత్తం 92 సెట్లు దాఖలు
కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల మొదటి ఘట్టం ముగిసింది. స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం వెల్లువలా నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులు, ముఖ్యనాయకులతో వచ్చి రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్రెడ్డికి నామినేషన్లు అందజేశారు. ఈ నెల ఒకటిన విడుదలైన నోటిఫికేషన్తో నామినేషన్ల ఘట్టం మొదలైంది. 8 రోజుల్లో మొత్తం 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొదటి రోజు 2, చివరి రోజున మంత్రి హరీశ్రావుతో కలిసి వచ్చి మరో 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ 4, ఆయన సతీమణి జమున 4 సెట్లు వేయగా కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నర్సింహారావు 3 సెట్లు దాఖలు చేశారు. చిన్న పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థుల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు.