హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్షేమం.. ఇంటి ముందు అభివృద్ధికి కండ్లకు కనిపిస్తున్న దృశ్యాన్ని టీఆర్ఎస్ తన ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగున్న ఎన్నికల ప్రచారం తొలిరోజే అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రత్యర్థి పార్టీలు అంత బలంగా లేకపోయినా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమతమ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. గురువారం అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులకు బీ- ఫారాలు అందజేసి ప్రచార పర్వానికి తెరతీశారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా తీవ్రత దృష్ట్యా భారీ బహిరంగ సభలు, బైక్ ర్యాలీల కన్నా నేరుగా ఓటరును కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలకు పెరిగిన నిధులు, కల్పించిన మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ఓటర్లకు వివరించేందుకు డివిజన్లు, వార్డులవారీగా ఖర్చుచేసిన నిధులను వివరిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతీరాథోడ్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచార వ్యూహాన్ని ఖరారుచేసి సంబంధిత ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వారి పరిధిలోని డివిజన్లలో పార్టీ బరిలో నిలిపిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవసరమైన ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ఉమ్మడి జిల్లా ఎమ్యెల్యేలను, జడ్పీ చైర్మన్లను రంగంలోకి దింపి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి తన్నీరు హరీశ్రావు, నకిరేకల్లో మంత్రి జగదీశ్రెడ్డి, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే లు బాలరాజు, లక్ష్మారెడ్డి ప్రచారం ప్రారంభించారు.
కాంగ్రెస్, బీజేపీ నామమాత్రమే
కాంగ్రెస్, బీజేపీ తమ ఉనికి కోసమే పోటీచేస్తున్నాయని, ఉన్నకొద్దిపాటి క్యాడర్ను కాపాడుకునేందుకు మాత్రమే ఆ పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపాయనే టీఆర్ఎస్ చేస్తున్న వాదనకు ఓటర్లు అవుననే సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే తమ ప్రాంతానికి అన్నివిధాలా ప్రయోజనమనే అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది.
వరంగల్ బరిలో 434 మంది అభ్యర్థులు
వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, కట్టంగూర్, మహబూబ్నగర్, కొత్తూరు, ఏప్రిల్ 22: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో తుదిపోరులో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం ఆఖరిరోజు కావటంతో చాలామంది నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బరిలో 434మంది నిలిచారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో 250 మంది పోటీలో నిలిచారు. ఇక్కడ 10వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్దిపేట మున్సిపల్ పోరులో 236 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో 93 మంది పోటీలో ఉన్నారు. జడ్చర్లలో 112 మంది, అచ్చంపేటలో 66 మంది తుదిపోరుకు సిద్ధమయ్యారు. కొత్తూరు మున్సిపల్ పోరులో 47 మంది పోటీలో నిలిచారు.