నల్లగొండ : చెత్తతో మానవ జీవనానికి ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ స్వచ్ఛ తెలంగాణ దిశగా సమిష్టి అడుగులు వేయాలని మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన స్వాహా రిసోర్స్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. ప్రతినిధి బృందం సభ్యులు మున్సిపాలిటీల అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంపింగ్ యార్డుల ప్రాధాన్యం, చెత్త సేకరణ, రీసైక్లింగ్ తదితర అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం డంపింగ్ యార్డుల నిర్మాణాలు చేపడుతోందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాలకు లోబడి వీటి నిర్మాణాలను చేపడుతోందని చెప్పారు. ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో సెగ్రిగేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ గా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట, ఖానాపూర్ ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ధేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్టు ఎమ్మెల్యే భాస్కర్రావు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. పొడి చెత్తను రీసైక్లింగ్ ప్లాంట్ లకు తరలిస్తారని, తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్ లలో మూడు నెలలపాటు నిల్వ ఉంచి సేంద్రీయ ఎరువుగా మార్చి రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ చీమ వెంకన్న, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ, కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, ఇలియాస్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.