మహబూబ్ నగర్ : పాలమూరు విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్సలర్గా ప్రొఫెసర్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ డీన్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసిన రాథోడ్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. మహబూబ్ నగర్లోనే డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన రాథోడ్ సొంత జిల్లాలోనే వీసీగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
క్రీడాకారుడైన తాను అటు విద్యతో పాటు క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు త్వరగా జీవితంలో స్థిరపడేలా విద్యాబోధన ఉండేందుకు గాను కొత్త కోర్సులు ప్రవేశపెట్టాల్సి ఉందని రాథోడ్ తెలిపారు.
యూనివర్సిటీలో ప్లేస్ మంట్ సెల్ ఏర్పాటు చేసి క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేసి మెరుగైన విద్యాబోధన జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణలో తొలిసారిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ కు వీసీగా అవకాశం లభించిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
వీసీగా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ కు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కుమార స్వామి, ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ బీఎస్ రావు, ఫైనాన్స్ అధికారి దయానిధి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రావు, అకౌంట్స్ ఆఫీసర్ బాలకృష్ణ, సూపరింటెండెంట్ రవీందర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్