హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కరోనాను ఎదుర్కోవడానికి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు శక్తిమంతంగా పనిచేస్తున్నాయని వైద్యుల అధ్యయనంలో తేలింది. టీకాలు వేసుకోనివారే ప్రమాదపుటంచులదాకా వెళ్తున్నారని స్పష్టమైంది. పాత వేరియంట్లే కాకుండా కొత్తగా విజృంభిస్తున్న మహారాష్ట్ర వేరియంట్ను సైతం టీకాలు అడ్డుకొంటున్నట్టు రుజువైంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో జరిగిన అధ్యయనం ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ రిసెర్చ్లో ఈ అంశాలు ప్రచురితమయ్యాయి.
88 శాతం మందికి తప్పిన ముప్పు
వ్యాక్సిన్లపై తలెత్తిన అపోహలకు సమాధానాన్ని తెలంగాణ వైద్యులు గుర్తించారు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు చెందిన వైద్యులు పీ మధు, డీ సంతోష్, కిరణ్ మాదాల.. దాదాపు నెల రోజులపాటు కృషిచేసి ఫలితాలు రాబట్టారు. వ్యాక్సిన్ తీసుకొంటే కలుగుతున్న ప్రయోజనాలను సీటీ స్కాన్ ఆధారిత అధ్యయనం ద్వారా బయటపెట్టారు. 206 మంది రోగులను రెండు గ్రూపులుగా విభజించి పరిశీలించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 25 మధ్య ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్ తీసుకొన్నవారిలో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉన్నదో సీటీ స్కాన్ ద్వారా గుర్తించి అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో కేవలం 12% మందిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉండగా, టీకా తీసుకోని గ్రూప్లో 88% మందికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వ్యాక్సిన్ తీసుకొన్న గ్రూప్లో అత్యధికంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలతో కరోనాను జయించగా, చాలా కొద్దిమంది మాత్రమే సీరియస్ సమస్యలను ఎదుర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోని గ్రూప్లో ఎక్కువ మంది మధ్య, స్వల్ప, సివియర్ స్థాయికి వెళ్లినట్టు తెలిసింది.
కొత్త వేరియంట్లపైనా అదే ప్రభావం
ఈ అధ్యయనంలో ఏప్రిల్ నెలలో పాజిటివ్ వచ్చి, దవాఖానలోచేరిన పేషెంట్లపై పరిశీలన జరిపారు. ఆ సమయంలో ఉత్తర తెలంగాణలో మహారాష్ట్ర వేరియంట్ తీవ్రంగా విజృంభిస్తున్నది. కరోనా వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరికి మహారాష్ట్ర వేరియంట్ ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. దీనిప్రకారం, వ్యాక్సిన్లు బలమైన మహారాష్ట్ర వేరియంట్ను సైతం తట్టుకొని రక్షణ కల్పిస్తున్నాయని వైద్యులు తెలిపారు. దీంతోపాటు బ్రెజిల్, నైజీరియా, సౌతాఫ్రికా తదితర వేరియంట్లు ఉన్నప్పటికీ టీకాలు బాగా పనిచేస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.
టీకాల వల్ల ఎంతో ప్రయోజనం ఉంది
మా అధ్యయనం ప్రకారం, టీకాలు తీసుకొన్న వారికి కరోనా వస్తే చాలామంది సాధారణ లక్షణాలతో వారంపది రోజుల్లో బయటపడుతున్నారు. షుగర్, స్థూలకాయం వంటి సమస్యలున్న వారిలో కొంతమేర సివియర్ లక్షణాలు ఉంటున్నాయి. టీకాలు తీసుకోని వారికి పైగా షుగర్, స్థూలకాయం, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వారికి ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారే ఎక్కువగా ఐసీయూ చికిత్స వరకు వెళ్తున్నారు. అందుకే అందరూ తప్పనిసరిగా టీకాలు తీసుకోవడం మంచిది.
-డాక్టర్ కిరణ్ మాదాల,
క్రిటికల్ కేర్ హెడ్, నిజామాబాద్ జనరల్ హాస్పిటల్