నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మే 18: భారత్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు 80శాతానికి పైగా సత్ఫలితాలనిస్తున్నట్టు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కొవిషీల్డ్తో పాటు ఇతర వ్యాక్సిన్లు ఎంతవరకు వైరస్కు ప్రతిరక్షకాలను అభివృద్ధి చేయగలుగుతున్నాయనే విషయంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు జరుపుతున్నారు. రెండవ డోస్ తీసుకున్న పదిరోజుల తర్వాత వివిధ రకాల వ్యక్తుల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇన్విట్రో న్యూట్రలైజేషన్ విధానంలో పరీక్షలను నిర్వహించారు. రెండోడోస్ వేసుకున్న 10-18రోజుల్లో యాంటిబాడీలు ఏర్పడుతున్నట్టు గుర్తించారు. యాంటిబాడీలు వైరస్ను న్యూట్రలైజ్ చేస్తున్నట్టు పరిశోధనలో తేలింది. భారత్కు చెందిన డబుల్ మ్యూటెంట్ బీ.1.617 రకం, యూకేకు చెందిన బీ.1.1.7, ఈ-484కే, దక్షిణాఫ్రికాకు చెందిన బీ.1.351తో పాటు బ్రెజిల్ వేరియంట్లపై వ్యాక్సిన్లు ఏవిధంగా పనిచేస్తున్నాయనే విషయంపై పరిశోధన కొనసాగుతున్నది.
ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో వ్యాక్సిన్లు కరోనా వైరస్లను నిలువరించగలుగుతున్నాయని గుర్తించారు. అయితే రెండో డోసు వేసుకున్న వారికి వైరస్ సోకదనేది ఏమీ లేదని, జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి 80నుంచి 90శాతం వరకు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్లు తప్పనిసరిగా ధరించి, బౌతికదూరం పాటిస్తేనే వైరస్ను కట్టడి చేయగలుగుతామని ఆయన పేర్కొన్నారు.