లక్షణాలు కనిపించకుండానే పరేషాన్ చేస్తున్నది. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతాపం చూపిస్తున్నది. జ్వరం, దగ్గు, జలుబు లేకున్నా, పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ లోలోపల శరీరానికి తీవ్ర నష్టం చేస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ వేగంగా వ్యాప్తి చెంది, పెను నష్టం కల్గిస్తున్నది. రెండోసారి కూడా ఇన్ఫెక్షన్ సోకుతూ తిప్పలు పెడుతున్నది.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): మన రాష్ట్రంలో మహారాష్ట్ర, దక్షిణాఫ్రికా, నైజీరియా, యూకే తదితర వేరియంట్లు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. ఇందులో మహారాష్ట్ర వేరియంట్ ఎక్కువ ఇబ్బందులకు గురిచేస్తున్నది. సెకండ్వేవ్లో నమోదైన కేసుల్లో 30% పైగా ఈ ర కానికి చెందినవే. సాధారణ లక్షణాలు కనిపించకపోయినా ఊపిరితిత్తులపై తీవ్రప్రభావం చూపిస్తున్నది. వ్యాధిని గుర్తించేలోపే తీవ్ర నష్టం జరుగుతున్నది. మహారాష్ట్రకు సమీప జిల్లాల్లో ఉన్న కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల్లో ఈ ఉదాహరణలు వెలుగుచూస్తున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో చేసిన ఓ అధ్యయనం ప్రకారం, అక్కడ కొవి డ్ చికిత్స పొందుతున్న 180 మంది పేషెంట్లలో దాదాపు 150 మందిలో మధ్యస్థ ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు గుర్తించారు. సగటున 50% వరకు వీరి ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయినట్లు నిర్ధారించారు. పేషెంట్లను దవాఖానకు తీసుకొస్తున్న అంటెండెంట్స్కి సైతం లక్షణాలు బయటికి కనిపించకముందే సివియర్గా మారుతున్నది. ఈ తరహా ఉదాహరణలు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లా దవాఖానల్లో గమనిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 28న వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మహారాష్ట్ర వేరియంట్ను (బీ.1.617) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో 617-1, 617-2, 617-3 అనే మూ డురకాలు ఉన్నట్లు గుర్తించారు. 1, 2 రకాలను 2020 డిసెంబర్లో గుర్తించారు. మన దేశంలో అత్యధిక కేసులకు ఇవే కారణం. కాగా, మూడో రకాన్ని వీటి కంటే ముందే అంటే అక్టోబర్ 3న గుర్తించారు. దీనివల్ల కేసులు తక్కువగానే ఉన్నాయి. ఇందులో మూడురకాల మ్యుటేషన్లు ఉన్న ట్లు నిర్ధారించారు. ఎల్452ఆర్ రకానికి వ్యాప్తి గుణం, రీ ఇన్ఫెక్షన్ కల్గించే గుణం ఎక్కువ. రెండోరకం పీ 681ఆర్ లోనూ ఎక్కువ వ్యాప్తి గుణం ఉండగా, సివియర్ ఇన్ఫెక్షన్ కల్గిస్తుంది. ఇక మూడో మ్యుటేషన్ ఈ484క్యూ వల్ల రీఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుం ది. ప్రధానంగా 1, 3 రకాల్లో ఈ మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. బీ1427 అనే యూఎస్ వేరియంట్లో ఎల్452ఆర్ అనే మ్యుటేషన్ ఉంది. అందుకే కాలిఫోర్నియాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇదే లక్షణంతో ఉన్న మహారాష్ట్ర రకం వేరియంట్ వల్ల దేశంలో, రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే వ్యాధి ప్రామాణిక లక్షణాలు బహిర్గతమవుతాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు ఈ రకం వైరస్లో చాలా తేడాలున్నాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన రోజునుంచి తీవ్ర ప్రభావం చూపే వరకు నాలుగు దశలు ఉంటాయి. అవి ఇంక్యుబేషన్, వైరీమియా, ఎర్లీ లంగ్, లేట్ లంగ్. సాధారణంగా ఇంక్యుబేషన్ దశ 5 రోజులు ఉంటే, ఇప్పుడు 3 రోజులకు తగ్గింది. వైరీమియా అనేది ఇంతకుముందు 7 రోజులు ఉంటే, ఇప్పుడు 5 రోజులకు తగ్గింది. ఈ దశలో లక్షణాలు కనిపించాలి కానీ, కనిపించడం లేదు. ఈ సమయంలో వైరస్ తన సంతతిని చాలా ఫాస్ట్గా పెంచుకుంటున్నది. వైద్యులు, పేషెంట్ ఈ దశను గుర్తించకపోవటం వల్ల తీవ్రనష్టం జరుగుతున్నది. దీంతో రెండోదశను గుర్తించి, చికిత్స అందించడంలో అందరం మిస్ అవుతున్నాం. ఎర్లీ లంగ్ స్టేజీలో లక్షణాలు కనిపిస్తుండటంతో అప్పుడే తనకు వైరస్ వచ్చిందనే ఆలోచనలో పేషెంట్లు ఉంటున్నారు. అయితే అప్పటికే చాలా నష్టం జరుగుతున్నది. ఇక నాల్గో దశ అయిన లేట్ లంగ్ చేరేసరికి సివియర్గా ఇన్ఫెక్షన్గా మారుతున్నది. మూడు దశల్లో సాధారణ కరోనా పరీక్షల్లో వైరస్ బయటపడకపోవటంతో సీటీ స్కాన్ చేసి ఇన్ఫెక్షన్ను గుర్తించాల్సి వస్తున్నది. ఇలా ఎంతోమందిలో మొదట లక్షణాలు కనిపించకపోయినా, సివియర్ పరిస్థితులకు చేరుతున్నారు.
మహారాష్ట్ర వేరియంట్ వైరస్ ప్రభావానికి లోనవుతున్న వారిలో ఎక్కువగా వెన్నునొప్పి, ఒంటినొప్పులు, తలనొప్పి, వీక్నెస్ వంటి కొత్త లక్షణాలు ఉంటున్నాయి. చాలామందిలో జ్వరం, గొంతునొప్పి వంటి సా ధారణ కరోనా లక్షణాలు కనిపించడం లేదు. కొత్త రకం లక్షణాలు కనిపించడం వల్ల చాలామంది అది కరోనా కాకపోవచ్చనే సంశయంలో ఉంటున్నారు. ఈ వైరస్ సోకినవారికి రెండునెలల వరకు ఆరోగ్య సమస్యలుంటున్నాయి. అలసట, ఒంటినొప్పులు, తలనొప్పి వంటివి కనిపిస్తున్నా యి. భారంగా శ్వాసతీసుకోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొవిడ్ తగ్గాక కూడా దాదాపు రెండు నెలలపాటు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయని, తర్వాత తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఏ కొత్త లక్షణం కనిపించినా కరోనా కావొచ్చని అనుమానించాలి. కొవిడ్ చికిత్స మొదలుపెట్టడంతోపాటు ఆక్సిజన్ స్థాయిని తెలుకోవడానికి ఆక్సీమీటర్ను అందుబాటులో ఉంచుకోవాలి. ఒకవైపు మందులు వాడటం, మరోవైపు ఆక్సిజన్, ఉష్ణోగ్రత చెక్చేసుకోవాలి. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహారాష్ట్ర వేరియంట్ శరీరం నుంచి వెళ్లిపోయినా ఇబ్బంది కలిగిస్తున్నది. వైరస్బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి.
డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల