వీణవంక, మే 29: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అనే నాటకం ఆడుతున్నాడని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని హిమ్మత్నగర్, కోర్కల్ గ్రామాల్లో శనివారం 12 గ్రామాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈటలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఆయనేనని నారదాసు గుర్తుచేశారు. ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి ఈటల ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. దళితుల భూములు ఆక్రమించినందుకే ఆయనపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడూ తాము టీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతామని, సీఎం కేసీఆరే నాయకుడని 12 గ్రామాల ముఖ్యకార్యకర్తలు స్పష్టంచేశారు. రెడ్డిపల్లి గ్రామ 5వ వార్డు మెంబర్ ఒడ్డెపెల్లి సారమ్మ, పలువురు మహిళలు టీఆర్ఎస్లో చేరారు. ఆ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ మాడ సాధవరెడ్డి, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, సర్పంచ్లు అంగిడి రాధ, ముత్తయ్య, పోతుల నర్సయ్య, ఆవాల అరుంధతి పాల్గొన్నారు.
జమ్మికుంట: ముస్లిం మైనార్టీలను సీఎం కేసీఆర్ తన భుజాలపై మోస్తున్నారని, మైనార్టీలమంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామని ముస్లిం మైనార్టీ జిల్లా నాయకుడు మహ్మద్ జకీర్ స్పష్టంచేశారు. శనివారం ఆయన జమ్మికుంటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మైనార్టీలకు దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు, పేదలకు బట్టల పంపిణీ, ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం షాదీ ముబారక్, మసీదుల్లోని ఇమామ్లకు వేతనాలు, యువతకు సబ్సిడీ రుణాలు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మసీదులు, ఈద్గాల అభివృద్ధికి నిధులు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టంచేశారు. ఎన్నికలు ఏవైనా మైనార్టీలంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముస్లింల పక్షపాతి అని, మైనార్టీలంతా పార్టీ వెంటే ఉంటామని హామీ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. సమావేశంలో కౌన్సిలర్ మల్లయ్య, ముస్లిం నాయకులు సలీం, నజీర్, మౌలానా, నయీం, జలాల్, ఖలీల్, సోఫియా, అఫ్రోజ్, సాదిక్, సలీం, జూబే, అబ్దుల్లా, హుస్సేన్ పాల్గొన్నారు.