(సూర్యాపేట): ఎం.టెక్ పూర్తి చేసి విదేశాలలో స్థిర పడాలనుకున్నాడు.. కానీ వీసా తిరస్కరణతో దేశంలోనే ఉండాల్సి వచ్చింది. ఉన్నత చదువు చదివి మంచి ఉద్యోగం చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినా తను మాత్రం వ్యవసాయా న్నే ఎంచుకున్నాడు. తన వ్యవసాయ భూమిని సాగు ప్రయోగశాలగా మార్చి నూతన వ్యవసాయ విధానంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన ఇట్టమల్ల స్టాలిన్.
వారసత్వంగా వచ్చిన పది ఎకరాల వ్యవసాయ భూమిలో 7 సంవత్సరాలుగా సుమారు 30 రకాల పంటలను సాగు చేసి వ్యవసాయంలో హైటెక్ రైతుగా నిలుస్తున్నాడు. పంటల సాగులో ఖర్చు తగ్గించి లాభాలు ఎలా సంపాదించాలనే లక్ష్యంగా తాను వ్యవ సాయంలో ప్రయోగం చేస్తున్నట్లు గర్వంగా చెప్పుకుంటున్నాడు. తను వ్యవసాయం ప్రారంభించన నాటి నుంచి ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసిన దాఖలాలు లేవు. కేవలం ఒకటి రెండు ఎరువుల వాడకం తప్పా అది కూడా తక్కువ మొతాదులో మాత్రమే వాడుతూ సెమీ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు.
వరిలో 5 రకాల వంగడాలు
సాధారణంగా వరి పంట సాగు చేసే రైతు ఒకటి లేదా రెండు రకాల విత్తనాలు వేసి సాగు చేస్తారు. కానీ స్టాలిన్ మాత్రం దాదాపు 5 రకాల విత్తనాలు సాగు చేస్తుంటాడు. ఈ ఏడాది 7 ఎకరాల్లో సన్నరకం, దొడ్డురకం, రెడ్ రైస్( నవ్వార రైస్), రెండు రకాల బ్లాక్ రైస్లను సాగు చేస్తున్నాడు. ఇలా ఐదు రకాల విత్తనాల వరి సాగు చేస్తు వరి సాగులో ఖర్చులు ఎలా తగ్గించాలని అనే విధానంపై నిత్యం ప్రయోగాలు చేస్తు ఉన్నాడు. గత ఏడాది వెదజల్లుడు పద్దతి, డ్రమ్ సీడర్తో వరి సాగు చేసి మంచి దిగుబడిని సాధించారు.
అర ఎకరం వరి డ్రమ్ సీడర్తో సాగు చేయగా దాదాపు 3 పుట్ల వడ్లు దిగుబడి వచ్చింది. ప్రతి యాసంగి వెదజల్లుడు పద్దతి ద్వారానే వరి సాగు చేస్తున్నాడు. వానకాలం కన్నా వేసవి కాలమే వెదజల్లుడు పద్దతికి అనువైన సమయమని అంటున్నాడు స్టాలిన్. గతంలో బాస్మతి రకం సైతం పండించాడు. బ్లాక్, రెడ్, బాస్మతి రకాలు పండించడం వలన అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నా ప్రాసెసిసంగ్ యూనిట్లు లేకపోవడంతో వీటిని పెద్ద ఎత్తున్న సాగు చేయడం లేదు. కానీ ప్రస్తుతం తాను పండించిన పంటలను సీడ్ రూపంలో అమ్మకాలు జరుపుతున్నాడు.
కూరగాయల సాగులో దిట్ట
వరి సాగుతో పాటు కూరగాయాల సాగులోనూ మంచి ఫలితాలను సాధించాడు స్టాలిన్. ప్రభుత్వ ప్రొత్సాహంతో ఎకరంలో షెడ్ నెట్ హౌజ్ వేసి అందులో ఇప్పటివరకు సుమారు 20 రకాల కూరగాయలు, ఆకు కూరులు, క్యారెట్, బీట్ రూట్, పీకేఎల్ ముగా, ఉల్లిగడ్డ సైతం పండించారు. ప్రతి సంవత్సరం రెండు నుంచి నాలుగు రకాల పంటలను సీజన్ వారీగా వేసి మంచి రాబడిని తీసుకువస్తున్నాడు. వరితో పాటు కూరగాయల సాగుతో అదనపు ఆదాయం పొందుతున్నాడు.
ఈ ఏడాది టమాట, మిర్చి, చిక్కుడిడుకాయ వేయడానికి సిద్ధం అవుతున్నాడు. యాసంగి మరో రకమైన కూరగాయలు వేస్తూ ఏడాదంత కూరగాయలు పండిస్తున్నాడు. కూరగాయల సాగు సమయంలో అధికంగా క్రిమిసహారక మందులు కొట్ట కుండా జాగ్రతలు తీసుకుంటూ కూరగాలు పండిస్తున్నాడు.
ఎకరంలో చేపల చెరువు
వరి, కూరగాయల సాగుతో పాటు ఎకరంలో చేపల చెరువును తవ్వించి అందులో చేప పిల్లలు వేశాడు. దీంతో మూడు రకాల పంటల సాగు చేస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో సైతం ప్రావీణ్యం సాధిస్తున్నాడు. 10 గుంటల భూమిలో సొంతంగా చేపల చెరువును తవ్వించి చేపలు పెంచుతుండగా మరో 30 గుంటల్లో ఉపాధి హామీలో చెరువును తవ్వించి చేపలు పెంచుతున్నాడు. ఈ రెండు చెరువుల్లో చేప పిల్లలను ఉత్పత్తి చేసి సీడ్ను అమ్మాలనే ఉద్దేశంతో ఉన్నాడు.
ఫెస్టిసైడ్స్ కొట్టిందే లేదు
24 సంవత్సరాల వయసులో వ్యవసాయం చేయడం ప్రారంభించిన స్టాలిన్ తనకు ఎలాంటి అనుభవం లేకున్న సాగులో క్రిమిసంహారక మందుల వాడకాన్ని నిషేధిస్తూ వస్తు న్నాడు. గడిచిన 7 సంవత్సరాలుగా ఫెస్టిసైడ్స్ పిచికారీ చేయకుండా పంటలు పండిస్తున్నాడు. కేవలం డీఏపీ 20-20-0-13 రకాన్ని మాత్రమే రెండు ఎకరాలకు ఒక బస్తాను వాడుతూ సహజంగా ప్రకృతి నుంచి వచ్చే వాటినే వినియోగించుకుంటూ పంటలను పడిస్తున్నాడు.
నిత్య విద్యార్థి
చదువుకునే నాటి నుంచి మంచి ప్రతిభ ఉన్న స్టాలిన్ వ్యవసాయ రంగంలో సైతం నిత్య విద్యార్థిగానే ఉంటున్నాడు. రోజు కు 12 గంటలు తన వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తు ఉంటున్నాడు. వ్యవసాయంలో వస్తున్న నూతన విధానంపై ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూ శిక్షణ తరగతులకు సైతం హాజరవుతున్నాడు. బెంగళూరు, చెన్నై, పూణె, హైదరాబాద్ వంటి చోట్ల జరిగే శిక్షణ కార్యక్రమాలకు హజరవుతూ సాగు విధానంలో మెలుకువలు నేర్చుకున్నాడు.
ప్రతి సంవత్సరం ఒక నూతన వంగడానికి తన వ్యవసాయ క్షేత్రంలో వేసి పండిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం కొలంబో కంది సాగును ప్రయోగంగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించాడు. ఒక సారి సాగు చేసే 3 సంవత్సరాల పాటు పంట దిగుబడి వస్తుంది. సంవత్సరానికి రెండు సార్లు పంట చేతికి వస్తుంది. ఇలా ఆరు సార్లు పంట దిగుబడి వచ్చింది. ఇలా నిత్య విద్యార్థిగా ప్రయోగాలు చేస్తు వ్యవసాయాన్ని అవపోశనం పడుతున్నాడు.
కూలీల సంఖ్య తగ్గించే విధంగా సాగు ప్రయోగం చేస్తా : ఇట్టమల్ల స్టాలిన్
వ్యవసాయంలో కూలీల కోరత చాలా ఉంది.. అదిక కూలీ ధరలతో రైతుకు భారంగా మారుతుంది. కానీ నూతన వ్యవసాయ పద్దతుల ద్వారా కూలీల సంఖ్య తగ్గించి వ్యవ సాయం చేసే విధానంపై నిత్యం ప్రయోగాలు చేస్తున్నాను. ఇద్దరు వ్యక్తులు పది ఎకరాలు సాగు చేసే విధంగా పంటల సాగు జరగాలనే లక్ష్యంగా తన ప్రయోగాలు ఉంటాయి. వెదజల్లుడు, డ్రమ్ సీడర్ విధానంతో కొంత విజయవంతం అయ్యాం. కూలీల సంఖ్య భారీగా తగ్గింది. మూస దోరణిలో చేయడం కంటే ప్రణాళిక బద్దంగా వ్యవసాయం చేయాలి. అప్పుడే కొంత మేర ఐనా విజయం సాధించగలం.