భీమారం(వరంగల్), జూలై 5: ఇప్పటివరకు డిగ్రీ సిలబస్ను ప్రామాణికంగా తీసుకోగా, ప్రస్తుతం 1-10 తరగతి సిలబస్ ఆధారంగా ఎడ్సెట్-2021 నిర్వహించనున్నట్టు కాకతీయ వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టిరమేశ్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు బీఎడ్ ఎంట్రన్స్లో మౌలిక మార్పులు చేసినట్టు తెలిపారు. ఎడ్సెట్-2021 విధానంలో వచ్చిన మార్పులను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా వివిధ రకాల డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు వేర్వేరుగా కాకుండా కామన్ సిలబస్తో కామన్ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మోడల్ పేపర్లు, వివరాల కోసం edcet.tsche.ac.in వెబ్సైట్ చూడాలన్నారు.
రేపటితో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు
ఎడ్సెట్ పరీక్ష ఫీజును ఈ నెల ఏడో తేదీ వరకు ఆన్లైన్లో చెల్లించాలని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. ఆలస్య రుసుముతో ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. జనరల్కు రూ.650, ఎస్సీ, ఎస్టీలతోపాటు దివ్యాంగ అభ్యర్థులకు రూ.450 ఫీజు ఉంటుందన్నారు. కంఫ్యూటర్ ఆధారిత పరీక్ష ఆగస్టు 24, 25 తేదీల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ మల్లికార్జునరెడ్డి, ఎడ్సెట్-2021 కో కన్వీనర్ ప్రొఫెసర్ శంకర్ పాల్గొన్నారు.