హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలరీస్ కేసులో ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీని ఎంబీఎస్ జ్యువెలర్స్ మోసం చేసిన కేసులో ఎంబీఎస్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఎస్ జ్యువెలరీస్, ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రైవేటు లిమిటెడ్కు సంబంధించి రూ.363 కోట్ల విలువైన 44 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఎంబీఎస్ నిర్వాహకులు సుఖేశ్ గుప్తా, అనురాగ్ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తా ఆస్తులు ఉన్నాయి. విచారణలో నిందితులు సహకరించడం లేదని ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మరో రూ.222 కోట్ల జరిమానా విధించింది. బంగారం కొనుగోళ్ల పేరుతో ఎంఎంటీసీకి రూ. 504 కోట్ల నష్టం చేసిందన్న అభియోగంపై ఎంబీఎస్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.