తెలుగు రాష్ర్టాల్లో రాజకీయ ప్రకంపనలు రేపిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. గురువారం నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్రెడ్డితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్సింహ, జెరూసలెం మత్తయ్య, వేం నరేందర్రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్ పేర్లను ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఎంపీ రేవంత్రెడ్డిని ఈడీ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నట్టు తెలిసింది. ఈడీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టారు. నరేందర్రెడ్డిని గెలిపించేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ని నోట్లతో ప్రలోభపెట్టి, అతని ఓటును తమ పార్టీ అభ్యర్థికి వేయించుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అందులోభాగంగా 2015, మే 30న స్టీఫెన్సన్ను కలిసిన రేవంత్రెడ్డి.. టీడీపీకి ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. అడ్వాన్స్గా రూ.50 లక్షలు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే స్టీఫెన్సన్ను తమవైపునకు తిప్పుకొనేందుకు చంద్రబాబు కూడా రంగంలోకి దిగి ‘మా వాళ్లు అంతా చూసుకుంటారు, బ్రీఫ్డ్ మీ’ అంటూ మాట్లాడిన ఆడియోలు కూడా బయటకు రావడంతో టీడీపీ కుట్రలన్నీ వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్టీఫెన్సన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జూన్ 1న స్టీఫెన్సన్ మిత్రుడు మాల్కం టేలర్ ఇంట్లో ఎంపీ రేవంత్రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్సింహా సమక్షంలో వేం కృష్ణకీర్తన్ రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెండ్గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో రికార్డును సైతం ఏసీబీ అధికారులు సేకరించారు. ఏసీబీ అధికారుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదుచేశామని, మనీలాండరింగ్ చట్టం కింద రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రేవంత్రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్సింహా, ఇతర సాక్ష్యుల స్టేట్మెంట్లను రికార్డు చేసినట్టు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర గురించి ఈడీ తన చార్జిషీట్లో పేర్కొన్నట్టు సమాచారం. కేసులో ట్రయల్ ప్రారంభించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు.