హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే.. దేశం అభివృద్ధి చెందుతుందని, దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని పాటించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. టైమ్స్ గ్రూప్ గురువారం నిర్వహించిన ఇండియా ఎకనమిక్స్ కాంక్లేవ్ 2021లో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. ‘స్టేట్స్ టు వాచ్ఔట్ ఫర్ ఇన్ ద నెక్ట్స్ డెకేడ్’ అంశంపై ప్రసగించారు. రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆర్థికశక్తిగా ఎదుగాలంటే, ఆర్థిక అంశాలు రాజకీయాలను అధిగమించాలని సూచించారు. సహకార సమాఖ్య గురించి మాట్లాడుతూ.. మాటలు కార్యరూపం దాల్చినప్పుడు టీం ఇండియా నినాదం బాగా పనిచేస్తుందన్నారు. ఆరేండ్ల క్రితం రాష్ట్రంలో తెలంగాణ, దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాయని, కానీ ఎన్డీయే ఇస్తున్న నినాదాలు వాస్తవరూపంలో అమలు కాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతున్నదని, కానీ కేంద్రప్రభుత్వ విధానాలు తెలంగాణ వంటి రాష్ర్టాల వృద్ధి వేగాన్ని అడ్డుకొనేవిధంగా ఉన్నాయని చెప్పారు. జీడీపీలో తెలంగాణ వాటా ఐదు శాతం ఉంటుందని, తమ రాష్ర్టాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మిషన్ భగీరథ వంటి గొప్ప పథకాన్ని చేపట్టినందుకు తెలంగాణకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సూచించినప్పటికీ, ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణకు ఎన్నడూ నిధుల విషయంలో కేంద్రం మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీఐఆర్, స్టీల్ ప్లాంట్లను ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. వ్యాక్సిన్ ప్రపంచానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నదని, ఇక్కడి నుంచి 70-80 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా జరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో తయారవుతున్న అన్ని వ్యాక్సిన్లలో 35శాతం ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. అలాంటి హైదరాబాద్కు వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశీయ పసుపు ఉత్పత్తిలో తెలంగాణ వాటా 35శాతంగా ఉన్నప్పటికీ పసుపు బోర్డు ఇస్తామని ఇతర రాష్ట్రాలకు హామీ ఇచ్చారని తెలిపారు.
డిఫెన్స్, ఎయిరోస్పేస్ రంగాలు ముఖ్యమైనవని, తెలంగాణ వివిధ డిఫెన్స్ ల్యాబ్లకు నిలయంగా ఉందని చెప్పారు. అందుకే హైదరాబాద్- బెంగళూర్ మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటుచేయాలని కోరుతున్నామని చెప్పారు. ఇది కూడా బుందేల్ఖండ్కు వెళ్లిపోతున్నదని అన్నారు. కలిసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ముఖ్యపాత్ర పోషించాలని, రాష్ట్రాలకు మద్దతు తెలపాలన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఎయిరోస్పేస్, టెక్స్టైల్స్, లాజిస్టిక్స్ వంటి భవిష్యత్తు ఉన్న రంగాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పాత్ర పోషించేందుకు భారత్కు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తయారీ రంగంలో ముందువరుసలో ఉన్న చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్కులు, కారిడార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.