హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కరోనా తీవ్రత తగ్గాకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సరికాదని గురువారం సమావేశమైన సీఈసీ అభిప్రాయపడింది. కొవిడ్ తీవ్రత తగ్గాక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఎమ్మెల్యే కోటాలో తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు జూన్ 3న, ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు మే 31న ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలపై ఇటీవల రెండు రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. చర్చించిన సీఈసీ పరిస్థితి మెరుగుపడేదాకా ఎన్నికలుండవని తెలిపింది. జూన్ 3న తెలంగాణ నుంచి పదవీకాలం పూర్తయ్యే ఎమ్మెల్సీల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్మాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు.