హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఏడేండ్లు పనిచేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని పీసీసీ మాజీ కార్యదర్శి, హుజూరాబాద్ నేత కౌశిక్రెడ్డి ఆరోపించారు. పదవులను అడ్డం పెట్టుకొని ఈటల వేలకోట్లు సంపాదించారే కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరాడని మండిపడ్డారు. హూజూరాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసేందుకు అనుచరవర్గం తో కలిసి బుధవారం తెలంగాణభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రే దత్తత తీసుకొని అభివృద్ధి చేసేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కే ఓటువేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెండేండ్లలో నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తామని, ఒకవేళ తాము అభివృద్ధి చేయకపోతే 2023లో ఓట్లు అడగబోమని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ కొండాపూర్లోని నివాసంలో మీడియా తో మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో, ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తన తరువాత ఈటలకే అధిక ప్రాధాన్యమిచ్చారని, దీన్ని అనుకూలంగా మలచుకొని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
ఈటల పదవుల్ని తన స్వార్థం కోసమే వాడుకున్నారని కౌశిక్రెడ్డి విమర్శించారు. ఈటలది హత్యాచరిత్రని ఆరోపించారు. 2018లో కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెంలో తాను ప్రచారానికి వెళితే తనపై హత్యాయత్నం చేశాడని తెలిపా రు. 2014లో మాజీ ఎంపీటీసీ బాలరాజును ఈటల రాజేందర్ హత్యచేయించారని ఆయన వెల్లడించారు. ఈటల చరిత్ర తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో.. డిపాజిట్ దక్కకుండా చేస్తారని తేల్చిచెప్పారు. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్లేకుండా పోతుందని ఆయన చెప్పారు.