హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉందన్నారు. 2014లో జరిగిన మాజీ ఎంపీటీసీ బాలరాజ్ హత్యలో ఈటల ప్రమేయం ఉందన్నారు. పైగా తనపైనే హత్యాయత్నాలు జరుగుతున్నాయన్న ఈటల ఆరోపణలను కౌశిక్రెడ్డి హేళన చేశారు. ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత ఎజెండా కోసం పోరాడుతున్న ఈటల రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు ఎన్నుకొని ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. గత 18 ఏళ్లుగా ప్రజలు ఈటలకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ తన హయాంలో అభివృద్ధి ఏం జరగలేదన్నారు. అప్పటి ఆర్థికశాఖ మంత్రిగా నియోజకవర్గానికి అభివృద్ధి నిధులను మంజూరు చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ అభివృద్ధి పక్కనపెట్టి స్వంత అభివృద్ధిపైనే దృష్టిపెట్టారన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ చేరుతున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నట్లు తెలిపాడు. ఉప ఎన్నికలలో అధికార పార్టీకి మరో అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆసక్తి చూపలేదన్నారు. బదులుగా ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని చెప్పారన్నారు. ఇది పార్టీకి ద్రోహం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చరిత్రలో తుడిచిపెట్టుకు పోతుందని కౌశిక్రెడ్డి అన్నారు.