టీఆర్ఎస్లో అడుగుపెట్టిననాటి నుంచి వెళ్లిపోయేదాకా ఈటల పదవిలోనే ఉన్నరు. అది ఎమ్మెల్యే పదవి కావచ్చు. మంత్రి పదవి కావచ్చు. ఎల్పీ లీడర్ పదవి కావచ్చు. ఆయన ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లింది? ఆయనకు జరిగిన నష్టమేంది? ఆయన పట్ల పార్టీ చేసిన తప్పేంది? ఆయనకు ఆయన చేసుకున్న తప్పుల వల్లే పార్టీ నుంచి నిష్క్రమించిండు.
-మంత్రి కేటీఆర్
ఆయనకు చేసిన నష్టమేంటి?
ఈటలపై ఆధారసహితంగా ఫిర్యాదు వచ్చిందనే విషయం అందరికీ తెలుసు. ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లింది? తనకు తాను ఆత్మవంచన చేసుకుంటున్నడు. తనను తాను మోసం చేసుకోవటంతోపాటు హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు జరిగిన నష్టమేంటి? పార్టీలో జరిగిన అవమానమేమిటో చెప్పాలి.
మీడియాతో చిట్చాట్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): అనామకుడైన వ్యక్తిని నాయకుడిగా మలిచి సీఎం కేసీఆర్ మంత్రినిచేశారు.. కానీ, రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి ఈటల రాజేందర్ ద్రోహంచేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఆయనది ఆత్మగౌరవం కాదని, ముమ్మాటికీ ఆత్మవంచనే అని పునరుద్ఘాటించారు. బుధవారం తెలంగాణభవన్లో టీఆర్ఎస్ కార్యనిర్వాహకసమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారంపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశారు. కేటీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
టీఆర్ఎస్ వల్లే గుర్తింపు
జన్మనిచ్చిన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్. టీఆర్ఎస్లో అడుగుపెట్టిననాటి నుంచి నిష్క్రమించేదాకా పదవిలోనే ఉన్నరు. అది ఎమ్మెల్యే కావచ్చు. మంత్రి కావచ్చు. ఎల్పీ లీడర్ కావచ్చు. ఆయన ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లింది? ఆయనకు జరిగిన నష్టమేంది? ఆయన పట్ల పార్టీ చేసిన తప్పేంది? ఆయన చేసుకున్న తప్పుల వల్లే పార్టీ నుంచి నిష్క్రమించిండు. ఆయనపట్ల పార్టీ చేసిన తప్పేంది? నాయకుడు చేసిన తప్పేంది? మంత్రిగా ఉంటూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పబ్లిక్గా తప్పుబట్టిండు. నిజంగానే తనకు ఇష్టం లేకపోతే క్యాబినెట్లో మాట్లాడాలి. డిసెంట్ నోట్రాయాలి. ఆయన ఒక్కసారన్నా క్యాబినెట్లో డిసెంట్ రాసిండా? నిజంగానే రైతుబంధు ఇట్లుండాలె.. అట్లుండాలె అన్నడు కదా మరి ఆ విషయాన్ని క్యాబినెట్లో చెప్పాల్సింది? అంతెందుకు రైతుబంధు ఆయన కూడా తీసుకున్నది నిజం కాదా? టీఆర్ఎస్ వల్ల ఈటలకు గుర్తింపు వచ్చింది. టీఆర్ఎస్లో ఉంటూ. కేసీఆర్ మంత్రివర్గ సభ్యుడిగా ఉంటూ మంత్రివర్గ నిర్ణయాలను, ప్రభుత్వ కార్యక్రమాలను బహిరంగ వేదికల మీద కించపరిచేవిధంగా మాట్లాడింది ఆయన. ఇతర పార్టీల నాయకులతో లోపాయికారి మంతనాలు సాగించింది ఆయన. ఐదేండ్లపాటు ఇవన్నీ చేస్తున్నా కేసీఆర్ చూసీచూడనట్టు ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు.
అనామకుడికి అందలం
ఈటలపై ఆధారసహితంగా ఫిర్యాదు వచ్చింది. అనామకుడు ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి చర్య తీసుకున్నరు అంటడు. మరి మీరు అనామకుడిగా ఉన్నప్పుడే కదా మిమ్మల్ని పార్టీలోకి తెచ్చింది. ఎమ్మెల్యే చేసింది. అప్పుడు ఈటల ఎవరికి తెలుసు. అన్యాయం జరిగింది అనే భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నడు. అసలు ఆయనకు జరిగిన అన్యాయమేమిటి? విమర్శలు ఎదుర్కొనేవాళ్లు చాలామంది ఉండొచ్చు. ఈటలపై అధారసహితంగా ఫిర్యాదు వచ్చిందనే విషయం అందరికీ తెలుసు. ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లింది? తనను తాను ఆత్మవంచన చేసుకుంటున్నడు. తనను తాను మోసం చేసుకోవటంతోపాటు హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు జరిగిన నష్టమేంటి? పార్టీలో జరిగిన అవమానమేమిటో చెప్పాలి.
అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదు?
ఐదేండ్ల కిందట గ్యాప్ వచ్చింది. ఆత్మాభిమానం దెబ్బతిన్నది అని అనుకున్నప్పుడు ఎందుకు మంత్రిపదవిలో ఉన్నవు. ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడే రాజీనామా ఎందుకు చేయలేదు? ఆయనది ఆత్మగౌరవం కాదు. ఆత్మవంచన మాత్రమే. ఐదేండ్ల నుంచి కేసీఆర్కు నాకు గ్యాప్ వచ్చిందని ఈటల అంటున్నడు. ఐదేండ్ల నుంచి గ్యాప్ ఉన్నా నిన్ను మంత్రివర్గంలో పెట్టుకున్న కేసీఆర్ గొప్పోడా? లేక మంత్రివర్గం నుంచి తొలగించాక ఆత్మగౌరవం గుర్తొచ్చిన నువ్వు గొప్పోడివా?
హుజూరాబాద్లో పార్టీల మధ్యపోరే
ఈటల టీఆర్ఎస్లో చేరే నాటికన్నా ముందే హుజూరాబాద్లో పార్టీ బలంగా ఉన్నది. ఈరోజు కూడా బలంగానే ఉన్నది. ఈటల 2003లో పార్టీలో చేరిండు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లోనే హుజూరాబాద్ (అప్పుడు కమలాపూర్) నియోజకర్గంలో నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీలు, సర్పంచ్లు అన్నీ టీఆర్ఎస్ గెలుచుకున్నది. పార్టీకి అప్పటికే నియోజకవర్గంలో బహుళ నాయత్వం ఉన్నది. దాదా పు 20మంది ఎమ్మెల్యే సీటుకోసం పోటీపడే పరిస్థితి. 2004 ఎన్నికల్లో ఈటల రాజేందర్కు టికెట్ ఎట్లా ఇస్తారు? అని అప్పుడే ఒక నాయకుడు పార్టీ కార్యాలయం ముందు హంగామా చేసిండు. అయినా ఉద్యమనాయకుడు కేసీఆర్ అందరినీ కాదని ఈటలకు టికెట్ ఇచ్చారు. హుజూరాబాద్లో జరిగేది వ్యక్తుల మధ్య పోరు కాదు. పార్టీల మధ్య పోరే. ఎన్నికలు వ్యక్తుల మధ్య ఉండవు. నూటికినూరుశాతం పార్టీల మధ్య.. సిద్ధాంతాల మధ్య జరుగుతవి. పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంది. ఎవరేం చేశారు? ఏ పార్టీ ఏంచేసిందో చర్చ జరుగుతది. హుజూరాబాద్లో పోటీచేసేది, గెలిచేది టీఆర్ఎస్సే.
కేంద్రాన్ని రూ.వెయ్యి కోట్లు ఇవ్వమనండి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. ఈ కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కానీ బీజేపీ ఏంచేసిందో ఈటల చెప్పాలి? ఈటలకు ఓటేస్తే బీజేపీ ఏం చేస్తదో చెప్పాలి? కోట్లకు కోట్ల ప్యాకేజీ ఇస్తున్నరు అని మమ్మల్ని అంటున్నరు కదా! కేంద్రంతో హుజూరాబాద్కు రూ.1,000కోట్లు విడుదల చేయించండి మేమెందుకు వద్దంటాం. రాష్ట్రప్రభుత్వం చిన్నది. మేం పదికోట్లో ఇరవై కోట్లో విడుదల చేస్తాం. అమ్మపెట్టదు అడుక్క తిననీయదు అన్నట్టు.. మీరు పెట్టరు. ఇచ్చేటోన్ని ఇవ్వనివ్వరా? మేము ఉప ఎన్నికలున్నకాడనే ఇస్తున్నమా? వేరేచోట ఇస్తలేమా? హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు రూ.1200 కోట్లుఇచ్చాం. అక్కడ ఏ ఎన్నికలున్నాయని ఇచ్చాం? ఈ ఏడేండ్లలో టీఆర్ఎస్ పార్టీగా.. ప్రభుత్వంగా హుజూరాబాద్ ప్రజలకు ఏం చేశామో మేం చెప్తాం. బీజేపీ ఏం చేసిందో చెప్పాలి? టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఈటల బీజేపీ ఖాతాలో ఎట్లా వేసుకుంటడు? ఆయన వ్యక్తిగతంగా చేయలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నకాలంలో జరిగిన అభివృద్ధి ఆయన చేసినట్టు ఎట్లా అవుతుంది?.
వారానికోరోజు వ్రతం
తెలంగాణలో వారంలో ఒకరోజు పాదయాత్ర చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యచేశారు. ‘వారంలో ఒక్కొక్కరు ఒక్కోవ్రతం చేస్తారు. ఆమె (షర్మిల) బహుశా అదే చేస్తుందేమో.. చేసుకోనివ్వండి అని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఎలాగైనా మాట్లాడుతయి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడగలు గుతారు. అది వారిష్టం. కానీ అంతిమం గా ఎవరేం చేస్తున్నారనేది ప్రజలు తేలుస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమూ మాట్లాడాం. కానీ టీఆర్ఎస్ పార్టీగా మా సిద్ధాంతాలపై ప్రజల్లో నిర్మాణాత్మక చర్చపెట్టాం. కృష్ణాజలాల విషయంలో ఏపీ ఎన్నికేసులు వేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసంతో ఉన్నాం.
బండికి ‘ప్రగతి’ స్వాగతం
బండిసంజయ్ పాదయాత్ర చేసే ముందు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో స్పష్టంచేయాలి. ఆయన పాదయాత్రకు పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు, గ్రామాలు అద్దంలా మెరుస్తూ స్వాగతం పలుకుతాయి. బీజేపీ రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలున్నాయా? దేశంలో పురోగమిస్తున్న రాష్ర్టా న్ని బండి సంజయ్ కండ్లారా చూస్తారు.
తప్పుచేశానని ఆయనే ఒప్పుకున్నడు
ఈటలకు సానుభూతి ఎట్లుంటది? ఏం తప్పుచేయకుండానే నిష్క్రమించిండా? ‘మీరు పాలమూరు ప్రాజెక్టుకు అసైన్డ్ భూములు తీసుకోచ్చు కానీ నేను తీసుకోవద్దా?’ అంటూ ఆయనే ప్రెస్మీట్లో ఒప్పుకున్నడు. అంతకుమించిన అడ్మిషన్ ఏముంటది? ప్రభుత్వం చేస్తే రైటు.. నేను చేస్తే తప్పా అంటే ఏమన్నట్టు? బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం చేసిన చట్టాలను అతిక్రమించటం సరైనదా? తప్పుచేసింది ఆయన. ఒప్పుకున్నది ఆయన. పార్టీ అధినేత గౌరవం ఇచ్చిండు. అన్ని పదవులు ఇచ్చిండు. శిక్షణనిచ్చి ఈటలను నాయకుడిగా తయారుచేసిండు. సీఎం కేసీఆర్ కక్ష పూరితంగానే మంత్రిపదవి ఇచ్చిండా?
ఎవర్నీ కలువనన్నాక నేనెట్లా కలుస్తా?
ఈటల చివరి వరకు పార్టీలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నం. 17 ఏండ్లు కలిసి ప్రయాణంచేసినం. నేనెందుకు ఆయనపట్ల వేరే భావంతో ఉంట. కరోనాతో నేను హాస్పిటల్లో ఉన్న. మధ్యాహ్నం వార్త బయటకొచ్చింది. సాయం త్రం కల్లా ప్రెస్మీట్ పెట్టిండు. ‘నేను ముఖ్యమంత్రిని కలువ’ అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ముఖ్యమంత్రినే కలువ అన్నంక నేనెట్ల కలుస్త? నేనున కలిసి ఏం చేయాలె? మంత్రిగా ఉంటూ నేను సీఎంను కలువ అంటవు. ఆయన ఫోన్చేసినా పోను అంటడు. ఏం చేయాలె?