ముసుగు తొలిగింది. అసలు పస బయటపడింది. పేరుగొప్ప మేతావుల ముద్దు బిడ్డ, మహాశూన్య నాయకుడి మాయ ఏమిటో, గాయి ఏందుకో గత్తర్లా బట్టబయలైంది. నిజం నిలకడగా, నిటారుగా నిలబడింది. ఆకాశం మీద ఉమ్మేయాలనుకొంటే తనమీదే పడుతుందట. ఒకరిని వేలెత్తి చూపాలని చూస్తే నాలుగు వేళ్లు తననే చూపిస్తాయట! ఇది మరోసారి రుజువైంది. ఎంత గొప్ప మాటకారి అయినా, అసలు నిజాన్ని అతడి నోటి నుంచే కక్కించడం సమాజమనే సత్య పీఠానికి మాత్రమే సాధ్యం. శుక్రవారం జరిగిందదే.
టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడానికి విలేకరులతో మాట్లాడిన ఈటల రాజేందర్, తన డొల్లతనాన్ని తన నోటితోనే బయటపెట్టుకున్నారు. తన బండారాన్ని తానే నిస్సిగ్గుగా బరిమాతల ప్రదర్శించారు. తాను వల్లించే ఆదర్శాల పట్ల చిత్తశుద్ధి ఎంతటిదో, తాను ప్రవచించే సిద్ధాంతాల పట్ల తన విధేయత ఏ పాటిదో తేటతెల్లం చేశారు. మొత్తానికి తన జ్ఞానమెంతటిదో తెలంగాణ సమాజానికి జ్ఞానోదయం కలిగించారు. ఆయన్ను అవతార పురుషుడిలా చూపించేందుకు యమయాతన పడుతున్న మేధావులు సైతం అవాక్కయ్యేలా… రాజేందర్ గింతేనా, గీపాటోడేనా అనిపించారు!
ఈటలను కేసీఆర్ రాజకీయంగా 20 ఏండ్లుగా పెంచి పెద్ద చేశారు. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు ఈటల 5 ఏండ్ల క్రితమే కుట్ర పన్నారు. టీఆర్ఎస్ తల్లిలా ఆయనను పోషించింది. అలాంటి టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఈటల కొత్త పార్టీ పెట్టే పన్నాగం పన్నారు. అనేకమంది టీఆర్ఎస్ నేతలు ఈటల ఎదుగుదలకు సహకరించారు. వారందరినీ ఆయన తృణీకరించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బీసీ ముద్ర ఆయన పెరుగుదలకు ఆయువుపట్టు. బీసీల భూమిని ఆయన కబ్జా చేశారు. వామపక్ష భావజాలం ఈటల వ్యక్తిత్వానికి గౌరవాన్ని అబ్బింది. అలాంటి వామపక్ష పార్టీలను గంజిలో ఈగలా తీసి పారేశారు. స్వయంకృత అపరాధాలతో సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయనకు అండగా నిలబడ్డారు. కానీ ఆయన కాంగ్రెస్ను గడ్డిపోచ కింద జమకట్టారు.
ఇప్పుడు ఇన్నాళ్లూ తాను తిట్టిన, తనను తిట్టిన బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. ఈటలను అవతార పురుషుడిలా ప్రొజెక్ట్ చేయడానికి సోకాల్డ్ మేధావులు బద్దలు కడుతుంటే, ఆయన ఆ బద్దలతో సహా వారంతా వ్యతిరేకించే బీజేపీలో చేరుతున్నారు. అందుకు తన నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని పచ్చి అబద్ధాలు చెప్పారు. పార్టీ పెట్టాలని ఏనాడూ అనుకోలేదని మొన్నటికి మొన్న చెప్పిన ఈటల పార్టీ పెట్టేందుకు ప్రయత్నించానని ఇవాళ చెప్పారు.
ఇదీ ఈటల నైజం. ఇదే అసలు నిజం..
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూములు నా అధీనంలో ఉన్న మాట నిజమే, కానీ నేను కబ్జా కోరును కాను.. బడుగుల భూములు తీసుకున్న మాట నిజమే, కానీ నేను బీసీ ద్రోహిని కాను.. దేవుని భూముల్లో షెడ్డు కట్టిన మాట నిజమే, కానీ నేను మాన్యాన్ని మలినపరచలేదు.. సంక్షేమ పథకాలను విమర్శించింది నిజమే, కానీ వాటిని ఆపాలని అన్లేదు.. చట్టాన్ని ఉల్లంఘించింది నిజమే కానీ, నిందితుడిని కాను.. అంటూ ఇప్పటిదాకా తలాతోకా లేని వాదనా పటిమ చూపిస్తూవస్తున్న ఈటల రాజేందర్, శుక్రవారం మరికొన్ని అమూల్యమైన తర్కాలు వినిపించి తెలంగాణ ప్రజలను తరింపజేశారు. భూస్వాములకు, బెంజ్ కార్లలో వచ్చే పెద్దోళ్లకు రైతుబంధు ఎందుకివ్వాలంటూ వీర కమ్యూనిస్టు అయిన ఈటల ప్రశ్నించారు. అయితే జరిగింది ఏమిటంటే, ఈటల పేరు మీద, ఆయన భార్య పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద దేవరయాంజాల్లో ఉన్న భూమికి గత ఐదు కారుల్లోనూ (సీజన్లలోనూ) ఈటలవారు ఎంచక్కా రైతుబంధు పైసలు.. అక్షరాలా 10 లక్షల దాకా తీసుకొన్నారు. ‘మరి వందల ఎకరాల భూములున్న ఈటల పేదోడా, పెద్దోడా? భూస్వామా? బడుగు జీవా? పోనీ బెంజ్కార్లో కాకుండా సైకిల్పైనో, ఎడ్లబండిపైనో వచ్చి రైతుబంధు పైసలు తీసుకొన్నారా?’ అని నెటిజనులకు సందేహమొచ్చి, సమాధానాలు దొరకక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. నిజానికి ఈటల, ఆయన కుటుంబం పేర మీద ప్రభుత్వ రికార్డుల్లో ఇంకా భూములున్నాయి. వాటికి లింకైన బ్యాంకు ఖాతాలను సమర్పించకపోవడం వల్ల ప్రభుత్వం రైతు బంధును జమ చేయలేకపోయింది. ఖాతా వివరాలు ఎందుకు లింక్ చేయలేదో ఈటలకే ఎరుక. బహుశా సీలింగ్ యాక్ట్ పరిధిలో ఇరుక్కుంటానని భయపడ్డారేమో! ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వ్యవసాయం నాశనమై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దీన్ని పునరుద్ధరించడానికి, పేద రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. దీనికింద లబ్ధి పొందుతున్నవారిలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపువారే! రైతు బంధును పెద్ద రైతులు స్వచ్ఛందంగా వదులుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు కూడా ఇచ్చారు. దీనికి స్పందించి చాలామంది రైతుబంధు సాయాన్ని తీసుకోవడం లేదు. ఇన్నాళ్లూ మంత్రిగా ఉన్న మహా ఆదర్శవాదికి ఈ సంగతి తెల్వదా? తెలిస్తే రైతుబంధు వద్దని చెప్పొచ్చు కదా? లేకుంటే వచ్చిన పైసలు వాపస్ ఇవ్వొచ్చు కదా? కనీసం ఏదైనా ప్రజాహితం కోసం ఉపయోగించవచ్చు కదా! అన్ని ఎకరాల్లో నేను వ్యవసాయం చేయడం లేదు, ఈ డబ్బు నాకొద్దు అని నిజాయితీగా ప్రకటించవచ్చు కదా? ఎందుకు చేయలేదు? అద్గదీ కామ్రేడ్ ఈటల ఆదర్శం! ‘మూడేండ్ల నుంచి రైతుబంధు తీసుకొని, ఇప్పుడేమో వ్యవసాయం చేయని వాళ్లకు, బెంజ్కార్లలో వచ్చినోళ్లకు రైతు బంధు ఇస్తున్నారని అడ్డం పొడుగు మాట్లాడారు. ఇంతకంటే ఆత్మవంచన, ప్రజా వంచన, నయవంచన మరొకటి ఉండదు’ అని విలేకరులే గుసగుసలాడారు. ఈటల నోటి నుంచి అన్నీ ఇలాంటి నగ్నసత్యాలే బయటకొచ్చాయి. బీజేపీలో చేరుతున్నారు కదా! ఆ శ్రీరాముడు దయదలిచాడేమో!
ఇదేనా ఆత్మగౌరవం?
మొన్నటికి మొన్న ఈటల భార్య మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆత్మగౌరవం దండిగా ఉన్నదన్నారు. ఇవాళ ఈటల ఉమ్మడి పాలకులు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని, వాళ్లలా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని ప్రవచించారు. అదీ తెలంగాణపై, ఆత్మగౌరవంపై ఆయనకున్న ఆపారమైన ప్రేమ. ‘ఇంతకన్నా బద్మాష్, బట్టేబాజ్ మాట ఇంకొకటి లేదు. ఉమ్మడి పాలకులు అనుమతిస్తే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ జనం కొట్లాడితే తెలంగాణ వచ్చిందా? ఇదేనా ఈటల ఉద్యమ స్ఫూర్తి’ అని రాజకీయ విశ్లేషకుడొకరు దునుమాడారు. మంత్రి పదవిని బానిస పదవిగా, సీఎం అధికార నివాసం ప్రగతిభవన్ను బానిసభవన్గా అభివర్ణించి ఈటల తన ఫ్రస్ట్రేషన్ను బయటపెట్టుకొన్నారు. బానిస పదవి అయితే ఏడేండ్ల నుంచి ఎందుకు పట్టుకొని వేలాడినట్టు? ఐదేండ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ వచ్చిందని ఆయనే చెప్పుకొన్నడు. మరి అప్పుడైనా వదిలేయొచ్చు కదా! ఆత్మగౌరవానికి అడ్రస్ నేనే చెప్పుకొంటున్న ఈటల కనీసం కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడైనా బానిస పదవి నుంచి బయటపడొచ్చు కదా! బర్తరఫ్ చేసేదాకా ఎందుకు ఆగినట్టు? ఆయన్ను ఆపింది ఎవరు? వద్దని ఎవరైనా కాళ్లు పట్టుకుని బతిమిలాడారా? ఈటల చెప్పేదొకటి, చేసేదొకటి, మనసులో ఒకటి అన్నది దీంతో స్పష్టమైంది. పార్టీనుంచి అందరినీ పంపించారు? సంఘాల సమ్మె హక్కుని కాదన్నారంటూ ఇప్పుడు సుద్దులు చెప్తున్న ఈటల అప్పుడెందుకు మాట్లాడలేదు? బానిస మంత్రి పదవిని పట్టుకుని ఎందుకు వేలాడారు? ఇదీ ఆయన నీతి నిజాయితీ. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, పార్టీ- ప్రభుత్వం తీసుకునే సమిష్టి నిర్ణయాల్లో భాగస్వామి అవుతారు. జరిగిన అన్నింటిలో ఆయన పాత్రా ఉంటుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా తగుదునమ్మా అని సూక్తి ముక్తావళి వల్లించడం విడ్డూరం. మంత్రి పదవిస్తే అన్నీ ఒప్పులే. తీసేస్తే అన్నీ తప్పులే! అంతే కదా! ఎంత దిగజారుడుతనం!
ఐదేండ్ల క్రితమే కుట్రా!?
ఈటలను కేసీఆర్ రాజకీయంగా 20 ఏండ్లుగా పెంచి పెద్ద చేశారు. ఆయనపై తిరుగుబాటుచేసేందుకు ఈటల ఐదేండ్ల క్రితమే కుట్ర పన్నారు. టీఆర్ఎస్ తల్లిలా ఆయనను పోషించింది. అలాంటి టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఈటల కొత్త పార్టీ పెట్టే పన్నాగం పన్నారు. టీఆర్ఎస్లోని అనేకమంది నాయకులు ఈటలతో కలసి నడిచి ఆయన ఎదుగుదలకు సహకరించారు. వారందరినీ ఆయన తృణీకరించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బీసీ ముద్ర ఆయన పెరుగుదలకు ఆయువుపట్టు. అలాంటి బీసీల భూమిని ఆయన కబ్జా చేశారు. వామపక్ష భావజాలం ఈటల వ్యక్తిత్వానికి గౌరవాన్ని అబ్బింది. అలాంటి వామపక్ష పార్టీలను గంజిలో ఈగలా తీసి పారేశారు. స్వయంకృత అపరాధాలతో సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయనకు అండగా నిలబడ్డారు. కానీ ఆయన కాంగ్రెస్ను గడ్డిపోచ కింద జమకట్టారు. ఇన్నాళ్లూ తాను తిట్టిన, తనను తిట్టిన బీజేపీలో చేరే ఉబలాటంలో, కాషాయ కండువా కప్పుకోవడానికి తహతహలాడుతున్నారు. ఈటలను అవతార పురుషుడిలా ప్రొజెక్ట్ చేయడానికి సోకాల్డ్ మేధావులు బద్దలు కడుతుంటే, ఆయన ఆ బద్దలతో సహా వారంతా వ్యతిరేకించే బీజేపీలో చేరుతున్నారు. అందుకు తన నియోజకవర్గ ప్రజలు ఒత్తిడిచేస్తున్నారని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇదీ ఈటల నైజం. ఇదీ అసలు నిజం. ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా? ‘కుక్కతోక పట్టుకుని గోదారి ఈదుతాం అనుకున్నటు అయింది మా పని. ఈటల పప్పులో కాలేసాడా, తప్పులో కాలేసాడా? ఉప్పులో కాలేసాడా? నిప్పులో కాలేసాడా? అని బుర్రబద్దలు కొట్టుకున్నా మాకు అర్థం కావడంలేదు. ఆయన్ను చూసి మేం ఇన్నాళ్లూ మేధావి, సిద్ధాంతాలకు కట్టుబడిన, విలువలు గల వ్యక్తి అనుకున్నాం. కానీ గోలెంలో మునిగిన నక్క అసలు రంగు బయటపడ్డట్టు, ఇప్పుడు ఈటల అసలు రంగు బయటపడింది’ అని ఇన్నాళ్లూ ఈటలకు వంతపాడిన మేధావి ఒకరు వ్యాఖ్యానించారు. ‘చూస్తుంటే కేసీఆర్ కొట్టిన దెబ్బకు ఈటలకు ఖయాల్ తప్పినట్టుంది. ఆయన పూర్తిగా భయంలో పడిపోయారు. పరేశాన్ అవుతున్నారు. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఆయన జోకర్లా మారిపోయారు. ఇసుంటి పిరికోడు రాజకీయాలకు ఏం పనికొస్తడు. ఇన్నేళ్లు ఉద్యమంలో ఉన్నానని చెప్పే ఈటల నేర్చుకున్నది ఇంతేనా? ఆయన ఆలోచన పరిధి, రాజకీయ పరిజ్ఞానం ఇంత స్వల్పమా? అనిపిస్తున్నది. ‘భారీ బడ్జెట్ సినిమా, రెండు రోజుల్లో ఢమాల్ అన్నట్టు నెలరోజుల్లోనే ఈటల నవ్వులాటగా మారిపోయారు. ఆయన్ను నమ్ముకొని మేం ముందుకుపోతే నిండా మునిగేవాళ్లం. మొత్తానికి కేసీఆర్కు తిరుగులేదని మరోమారు రుజువైంది’ అని ఒక పాత్రికేయుడు విశ్లేషించారు.
చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?
మెతకగా, మెత్తని కత్తిలా కనిపించే ఈటల మాటలు చూడండి. ఒక అనామకుడు ఫిర్యాదిస్తే మంత్రిపై చర్య తీసుకొంటారా? ఇదీ అయన భాష. భూమి పోగొట్టుకున్న బడుగువర్గాల తెలంగాణ పౌరుడు ఆయన దృష్టిలో అనామకుడు. ఆయన భూమిని కబ్జాపెట్టినా మంత్రిగారిపై సీఎం విచారణకు ఆదేశించకూడదు. ఆదేశిస్తే కేసీఆర్ను తిడతా! ఇదీ లెక్క! ఇంకా ఏమన్నాడు ఈటల? పార్టీ పెట్టాలనుకున్నారట. డబ్బుతో వ్యవహారం కావడంతో ఆగిపోయాడట! అంటే ఎవరైనా డబ్బూ దస్కం సమకూరిస్తే పార్టీ పెట్టేవాడే అన్నమాట! కేసీఆర్పై ఈటల కుట్ర చేశారన్నదానికి ఇంతకన్నా ఆధారం ఏంకావాలి? కేసీఆర్పై తిరుగుబాటుకు ఈటల కొంతకాలంగా ప్రయతిస్తున్నారన్న నిజం రాజకీయవర్గాల్లో బహిరంగ రహస్యం. వివిధ కులవర్గాలతో, సోకాల్డ్ మేధావులతో, జర్నలిస్టులతో ఆయన రాత్రి విందు భేటీలు జరిపింది నిజం. అయితే ముగ్గురు నలుగురు తప్ప మిగతావారంతా, కేసీఆర్పై తిరుగుబాటు సరికాదని, తెలంగాణ కోసం ఆయన చేయలిగినంతా చేస్తున్నారని చెప్పారు. దీంతో ఈటల బీసీ- ఆత్మగౌరవం అంటూ కుట్రకు తెరతీశారు. బీజేపీలో చేరుతున్న ఈటలను చూసి ఇవాళ ఆ బీసీలే నివ్వెరపోతున్నారు. ‘ఇన్నాళ్లూ నువ్వు చెప్పిన సిద్ధాంతం ఏమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అంటూ సోషల్మీడియాలో తిట్టిపోస్తున్నారు.
కామ్రేడ్స్.. ఈటల అర్థమైండా
వీర కామ్రేడ్నని, లెఫ్టిస్టునని చెప్పుకునే ఈటలకు వామపక్షవాదం మీద ఉన్న గౌరవం కూడా మాటల సాక్షిగా బయటపడిపోయింది. పాపం కాం గ్రెస్ నేతలు రాత్రింబగళ్లు ఈటలకు మద్దతిచ్చినా, ఆ పార్టీనీ ఆయన బజారుకీడ్చారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా కేసీఆర్ మార్గ నిర్దేశంలో పనిచేస్తున్నాయని, వారు ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో కూడా కేసీఆరే నిర్ణయిస్తున్నారని కామ్రేడ్ ఈటల సగౌరవంగా బండలేశారు. పాపం లెఫ్ట్ పార్టీలు! సాయుధ పోరాట కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో గెలుపోటముల కన్నా, ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈటల లాగా అధికారం కోసం, ఆస్తులను కూడగట్టుకోవడం కోసం అవి ఎప్పుడూ అంగలార్చలేదు. ఈటలలా భోగాన్ని కాకుండా అవి త్యాగాన్ని నమ్ముకొన్నాయి. అందుకు కామ్రేడ్ ఈటల వాటికిచ్చిన కితాబిది! కాషాయపు కండువా వేసుకుంటున్నాడు కదా! ఆ మాత్రం తెగదెంపులు చేసుకోక తప్పదు మరి! లేకుంటే బీజేపీ వాళ్లు ఊరుకుంటారా! ఈటల మా మనిషి, ఈటలది మా భావజాలం అని లెఫ్ట్పార్టీలు ఇన్నాళ్లూ తెగ మోసాయి. బడుగుల భూమిని కబ్జా చేసినా, అటు చూడనట్టు నటించాయి. మరి ఈటల ఈ స్థాయిలో భుజకీర్తులు పెట్టిన తర్వాత లెఫ్ట్ నేతలు ఏం చేస్తారో చూడాలి. ఉన్న కాస్త ఇమేజ్నైనా కాపాడుకోవడానికి అవి బడుగుల వైపు నిలుస్తాయా? అసైన్డ్ భూములను పేదలకు ఇప్పించేందుకు ఇప్పటికైనా పోరాడుతాయా? ఈటల చెర నుంచి తప్పిస్తాయా? లేదా? కాలమే చెప్పాలి.
మేం బీజేపీలోకి పొమ్మన్నామా?.. హుజూరాబాద్ ప్రజల దిగ్భ్రాంతి
అబద్ధానికి- మోసానికి మధ్య పుట్టిన సంకరాల్లా ఈటల మాటలున్నాయని ఒక నాయకుడు విశ్లేషించారు. బీజేపీ- టీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదని తెలుసుకున్నాకే బీజేపీలో చేరుతున్నాడట. ఒకవేళ బంధం ఉంటే తన ఆస్తులకు అక్కడి నుంచి రక్షణ దొరకదన్నది అసలు బాధ అని ఆయన అసలు సంగతి విప్పి చెప్పారు. తనది కమ్యూనిస్టు డీఎన్ఏ అయినప్పటికీ, ప్రజలు, కార్యకర్తలు, సన్నిహితుల ఒత్తిడి మేరకే బీజేపీలో చేరాల్సి వస్తున్నదని ఈటల చెప్పిన మరో మహావాక్కు. ‘ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదు. నిజానికి మేమంతా ఆయన్ను బీజేపీలో చేరొద్దని చెప్పాం. మాకు చెప్పిన సిద్ధాంతం ఏమిటి? నువ్వు చేస్తున్నదేమిటి? బీజేపీలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో మనకు కనబడటం లేదా? బండ మీది నుంచి ఎవరైనా బాయిల దుంకుతరా అని మేం అడిగినం సర్. అయితే తన ఆస్తులు కాపాడుకోవాలంటే ఇంతకన్నా మార్గం లేదని చెప్పి పోయిండు. గీయననా మా ఎమ్మెల్యే. గీయనకేనా మేం ఓట్లేసి గెలిపించింది. సిైగ్గెతుంది’ అని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి చాలామంది నమస్తే తెలంగాణ ఆఫీసుకు ఫోన్చేసి తమ ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల పీడ వదిలించి సార్ ఇప్పటికైనా మంచి పని చేసిండని అన్నవారొకరైతే, ఈటల బండారం బయటపడిందని మరొకరు అన్నారు. ఇక బీజేపీలో చేరికకు ఈటల సమర్థనను చూసి సోషల్ మీడియా శోషొచ్చి పడిపోయింది. ఇప్పటిదాకా ఈటల బీసీ ఆత్మగౌరవ వాదనతో హుజూరాబాద్ ఓటర్లకు కండ్లు బైర్లు కమ్మగా, మునుగుతున్న నావలో చేరుతున్న ఆయన రాజకీయ పరిజ్ఞానానికి మూర్ఛ వచ్చినంత పనవుతున్నది.