జమ్మికుంట జూలై 10: పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈటలను సొంత తమ్ముడిలా చూసుకున్నారని.. ఈటల మాత్రం పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడని ధ్వజమెత్తారు. శత్రువులతో చేతులు కలిపి సీఎం కేసీఆర్కే వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. నిన్నటి దాకా బీజేపీని తిట్టిన ఆయన అదే పార్టీలో చేరడం దురదృష్టకరమన్నారు. ఆయన్ను ప్రజలు క్షమించరని, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మీ పదవులు కేసీఆర్ భిక్షే..
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సీఎం కేసీఆర్ను రేవంత్రెడ్డి, బండి సంజయ్ విమర్శించడం సరికాదని బాల్క సుమన్ అన్నారు. స్వరాష్ట్రం రావడంతోనే నేడు టీ పీసీసీ, టీ బీజేపీ అధ్యక్షులుగా పదవులు పొందారని వారికి హితవు పలికారు. వారి పదవులు సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి తుపాకీ రాముడు అని, బండి సంజయ్ తోక రాముడని ఎద్దేవాచేశారు. రేవంత్ టీడీపీ బినా మీ అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృధ్ధి కార్యక్రమాలపై విమర్శలు చేసే నాయకులు ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని సోషల్ మీడియా వారియర్స్కు పిలుపునిచ్చారు. పార్టీలోకి ఈటల లాంటి వారు వస్తుంటారు, పోతుంటారని.. పార్టీలో సీఎం కేసీఆర్తో ఎల్లప్పుడూ తామంతా ఉంటామని చెప్పారు. అంతకుముందు వావిలాల గ్రామం నుంచి జమ్మికుంట వరకు 300 బైకులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం పాల్గొన్నారు.
దొంగ ఓట్లు నిరూపించకుంటే ముక్కు నేలకు రాస్తావా?
ఈటలకు మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక సవాల్
హుజూరాబాద్ టౌన్: తన ఇంటి నంబర్పై దొంగ ఓట్లు నమోదై ఉన్నాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ అనడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి నంబర్పై మా అక్క, మా బాబాయిలకు చెందిన కుటుంబ సభ్యుల ఓట్లతోపాటు అద్దెకున్న కుటుంబ సభ్యుల ఓట్లు 2018కి ముందే నమోదై ఉన్నాయని వివరించారు. ఒకవేళ ఆ ఓట్లు దొంగవని నిరూపిస్తే హుజూరాబాద్ హనుమాన్ ఆలయం దగ్గర ముక్కు నేలకు రాస్తానని, కావని తేలితే ప్రజల సమక్షంలో ముక్కు నేలకు రాస్తావా..? అని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాతో ఓట్లు వేయించుకున్నప్పుడు అసలైన ఓట్లు.. ఇప్పుడెలా దొంగ ఓట్లు అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ‘శామీర్పేటలో ఉండే మీ కుటుంబ సభ్యులవి, హన్మకొండలో ఉండే మీ తమ్ముడి కుటుంబ సభ్యుల ఓట్లతోపాటు ఇతర బంధువుల ఓట్లు కమలాపూర్లో నమోదై ఉన్నాయని, అవి దొంగ ఓట్లు కానప్పుడు.. మా ఓట్లు దొంగ ఓట్లు ఎలా అవుతాయో చెప్పాలి. పార్టీని వదిలి నీ వెంట రాలేదని, మమ్మల్ని, మా ఓట్లను దొంగ ఓట్లు’ అని ఈటల మాట్లాడటం నీతిబాహ్యామైన వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.