జమ్మికుంట/వీణవంక/కమలాపూర్, జూలై27: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు షాకులమీద షాకులు తగులుతున్నాయి. టీఆర్ఎస్ను వీడినప్పటి నుంచి ఆయన వెంట ఉంటున్న ప్రధాన అనుచరులతోపాటు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన కమల నాయకులు, కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి దంపతులు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ బీఫాం, కారు గుర్తుపై తాను గెలిచానని, వార్డు ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని స్పష్టంచేశారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు మెచ్చి..
కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన 25 మంది బీజేపీ కార్యకర్తలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్కు చెందిన బీజేపీ నాయకులు కట్కూరి వెంకట్రాంరెడ్డి, సముద్రాల శ్రీనివాస్, ఉడుత అజయ్, రాజ్కుమార్, భీంపల్లి మాజీ ఎంపీటీసీ తోట శంకరయ్య తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కుమ్మరి సంఘం మండల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వీరికి కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.