హుజూరాబాద్, జూలై 10: ‘ఈటలా.. మాపై కేసులు పెట్టించలేదని అంటున్నావ్.. ఒకవేళ పెట్టించినట్టు నిరూపిస్తే మా మాదిగల చెప్పులు మెడల వేసుకుంటావా’ అని ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ప్రశ్నించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసినందుకే తమపై కేసులు నమోదైనట్టు ఈటల చెబుతున్న మాటల్లో నిజంలేదని స్పష్టంచేశారు. వ్యాపారులే కేసులు పెట్టుడు నిజమైతే తాను ఈటల చెప్పులు మెడలో వేసుకుంటామని, ఒకవేళ కేసులు పెట్టించింది ఈటలే అని నిరూపిస్తే మాదిగల చెప్పులు మెడలో వేసుకుంటావా? అని సవాల్ విసిరారు. ఉద్యమ నాయకుడిగా పనిచేసిన తనపై గత 15 ఏండ్లలో ఒక్క కేసైనా చూపించగలవా అని ప్రశ్నించారు. ‘ఎన్నికల సమయంలో కరపత్రాలు, వాల్పోస్టర్లు పెట్టి నాకు వ్యతిరేకంగా పని చేశాడు’ అన్న ఈటల.. ఇప్పుడు వ్యాపారులను బెదిరిస్తే కేసులు పెట్టారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిమీద ఈటల బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలం ఉందంటున్నావ్.. దమ్ముంటే ఆ వీడియోలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఈటల అవినీతి, అక్రమాల మీద ప్రశ్నించిన తర్వాతనే తనపై ప్రభాకర్రావు అనే వ్యక్తి కేసు పెట్టాడని, వారంరోజులు కాకముందే ఆ ప్రభాకర్రావును టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి కారణమేం టో చెప్పాలని ప్రశ్నించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్టు చేయించి 59 రోజులు జైలులో పెట్టించాడని.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే విడుదల ఎందుకయ్యానో సమాధానం చెప్పాలన్నారు. ఈటల ఒక దొంగ, మోసకారి అని చాడ వెంకట్రెడ్డి, మందకృష్ణమాదిగ, ఆర్ కృష్ణయ్యతోపాటు మావోయిస్టు పార్టీ ప్రకటించినా సిగ్గు రాలేదా? అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట లగడపాటి, డీ రామానాయుడు, రాయపాటి సాంబశివరావు, రామోజీరావు వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసిన మాట నిజం కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా బ్రోకర్ మాటలు, బోగస్ మాటలు ఆపకుంటే మాదిగలమంతా చైతన్యవంతమై నీ నాలుక చీరడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత జాతికి క్షమాపణ చెప్పిన రోజే వదిలిపెడతామని.. లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.