హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటున్నది. పాజిటివ్ వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది టెలికన్సల్టేషన్ సూచనలతో ఇంట్లోనే కోలుకుంటున్నారు. కొద్దిగా సీరియస్గా ఉన్నవారు వైద్యుల సంరక్షణలో వైరస్పై విజయం సాధిస్తున్నారు. కాగా, కొవిడ్ నుంచి రికవరీ అయ్యాక కూడా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. తీవ్ర లక్షణాలతో పాజిటివ్ వచ్చినవారు నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివారు కొన్నిజాగ్రత్తలు పాటిస్తే కొవిడ్ అనంతరం జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి
ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పాలల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకునేముందు పాలు తాగాలి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. చేపలు, గుడ్లు కూడా తీసుకోవచ్చు. మంచి ఆహారంతోపాటు మానసికంగా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.