పరిగి, మే 25 : పల్లెలు, పట్టణాల్లోని రోడ్లు, బస్తీలన్నీ పరిశుభ్రంగా ఉండడంలో కీలకపాత్ర పారిశుద్ధ్య కార్మికులు పోషిస్తున్నారు. ఉదయం నుంచే రోడ్లను శుభ్రం చేయడం మొదలు, మురుగుకాలువల్లో దుర్గంధం వెదజల్లుతున్నా వెరవక చెత్తాచెదారాన్ని తొలగించడం, అనంతరం వాహనాల్లో డంపింగ్యార్డులకు తరలించడం వరకు కార్మికులు చేస్తున్న సేవలు వెల కట్టలేనివి. ప్రస్తుత కరోనా సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ముందుండి సంపూర్ణ పారిశుద్ధ్యానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి పల్లె, పట్టణంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపడ్డాయి. ప్రభుత్వం ఇందుకు సంబంధించి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. ఈ కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయి. లాక్డౌన్ సమయంలోనూ పల్లెలు, పట్టణాలు సుందరంగా ఉండడానికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు, 565 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అనునిత్యం ఉదయం నుంచి పనుల్లో అలసట లేకుండా పనిచేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వ చర్యలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీల్లో 1300..
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో మొత్తం 1800 పైచిలుకు మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో 245 మంది, వికారాబాద్ మున్సిపాలిటీలో 170, పరిగి మున్సిపాలిటీలో 55, కొడంగల్ మున్సిపాలిటీలో 33 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి రూ.12వేలు, ఔట్ సోర్సింగ్గా పనిచేస్తున్న వారికి రూ.8వేల చొప్పున వేతనం అందుతున్నది. జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో సుమారు 1300 పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారు. వారు మల్టీపర్పస్ వర్కర్లుగా ప్రభుత్వం గుర్తించింది. వారికి నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందజేస్తున్నది. ఉదయం నుంచి రోడ్లు శుభ్రం చేయడం, మురుగుకాల్వల్లో చెత్తాచెదారాన్ని తొలిగించి డంపింగ్యార్డులకు చేరవేస్తున్నారు. వీరికి వేతనాలతోపాటు ప్రతి సంవత్సరం దుస్తులు, కొబ్బరినూనె, సబ్బులు, గ్లౌజులు అందజేస్తూ, కరోనా సందర్భంగా మరింత రక్షణగా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్లు సైతం అందజేస్తున్నది. మున్సిపాలిటీల్లో పనిచేసే సిబ్బందికి ప్రతినెలా ఆయా మున్సిపాలిటీలు వేతనాలు చెల్లిస్తున్నాయి. గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నది.
పరిశుభ్రతకు ప్రాధాన్యం..
ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సర్కారు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నది. లాక్డౌన్ సమయంలోను పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 6 గంటలకే పట్టణాల్లో రోడ్లన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. అలాగే పట్టణాలు, గ్రామాల్లో తమకు కేటాయించిన వార్డుల్లో మురుగుకాలువలు శుభ్రం చేయడం నిత్యం కొనసాగుతున్నది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు మరింత శుభ్రంగా మారాయి. వైరస్ బారి నుంచి రక్షణకు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేపడుతున్నారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు అందజేస్తున్నారు. మరోవైపు వారాంతపు సంతలు, పట్టణాల్లోని మార్కెట్లలోనూ లాక్డౌన్ ఆంక్షల సడలింపు సమయంలో ఏర్పాటుచేసిన కూరగాయల దుకాణాల వారు పారవేసిన వ్యర్థ పదార్థాలు తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించిన సర్కారు వారికి మొదటి విడుతలోనే వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం కల్పించింది. తరచుగా వైద్య పరీక్షల నిర్వహణ ద్వారా వారి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపిస్తున్నది. సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండడంలో కార్మికుల సేవలు గొప్పవిగా చెప్పవచ్చు.