హైదరాబాద్, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విస్తృత ఆదరణ లభించింది. ఫలితంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.122 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలైంది. దీని ద్వారా 2.77 లక్షల మంది ఇంటి యజమానులకు రూ.6.1 కోట్లు ఆదా అయింది. ‘ఎర్లీ బర్డ్’ స్కీం కింద ముందస్తుగా వార్షిక ఆస్తి పన్ను చెల్లించినవారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రాయితీ ఇస్తుండటంతో చాలా మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్ల పరిధిలోని 14.20 లక్షల మంది ఇంటి యజమానులు రూ.469.43కోట్లు చెల్లించేందుకు అర్హులు కాగా.. మే నెలాఖరు నాటికి 2.77 లక్షల మంది యజమానులు రూ.122.31 కోట్లు చెల్లించారు. మొత్తంగా 26 శాతం యజమానులు ముందుస్తుగా ఆస్తి పన్ను చెల్లించారు. గతేడాది ‘ఎర్లీ బర్డ్’ స్కీం ద్వారా రూ.124 కోట్లు వసూలయ్యాయి. ఈ వసూళ్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరుసగా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 32,147 మంది యజమానులు రూ.13.98 కోట్ల ముందస్తు పన్ను చెల్లించారు. వరంగల్ తర్వాతి స్థానాల్లో నిజాంపేట (రూ.8.32 కోట్లు), కరీంనగర్ (రూ.5.63 కోట్లు), నిజామాబాద్ (రూ.5.16 కోట్లు) కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఈ పథకం గడువు మే 31తో ముగిసింది. వాస్తవానికి ఈ ఏడాది ఈ పథకం గడువు ఏప్రిల్ నెలాఖరుతోనే ముగియాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో మే నెలాఖరు వరకు పొడిగించారు.