హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా మాస్కులు ధరించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ సైతం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరోనా బారినపడ్డ విద్యార్థులకు సెషన్స్ అన్నీ పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. బిట్శాట్ రాస్తున్న 1500 మందికి ఎంసెట్ పరీక్ష సమయం రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంసెట్కు మొత్తం 2లక్షల 51వేల 606మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,64,962 మంది, మెడికల్ విభాగానికి 86,644 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఏపీ నుంచి ఈ సారి ఎంసెట్కు 50 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. గతేడాది కంటే ఈఏడాది 28 వేల మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణలో 82 పరీక్ష కేంద్రాలు సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల కోసం 23 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఈ సారి ఎంసెట్ ఫలితాలను 15 రోజుల్లోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.