హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి, అంతర్ జిల్లాకు ప్రయాణించేవారికి అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే వారికి కూడా ఇది వర్తిస్తుందన్నారు.
పాస్ తీసుకోవాలనుకునే వారు https://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పోలీసు కమిషనర్లు, సంబంధిత పోలీసు సూపరింటెండెంట్లు దరఖాస్తులను పరిశీలించి పాస్ జారీ చేస్తారన్నారు. విమానాలు, రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు వ్యాలీడ్ టికెట్లను వెంటతీసుకువెళ్లాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వారు కూడా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసే పాస్లను కలిగి ఉండాలని పేర్కొన్నారు.