హైదరాబాద్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్డౌన్ను పటిష్టంగా అమలుచేయాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ అమలుపై మంగళవారం ఆయన ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్లు, ఎస్పీల నుంచి డీఐజీ స్థాయి అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్డౌన్ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఏవిధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణాకు కూడా ఆంక్షలు లేవని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. వివాహాలకు ఇరువైపుల ను 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలని అన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని చెప్పారు. అదేవిధంగా, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని స్పష్టంచేశారు.
కరోనా వాక్సినేషన్కు వెళ్లాలనుకొనేవారిని వారి మొదటి డోస్కు సంబందించిన సమాచారం సెల్ఫోన్లో చూసి సడలింపు ఇవ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద తగు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ-పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులు జారీచేస్తారని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీజీపీతోపాటు శాంతి, భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ కూడా పాల్గొన్నారు.